మొన్న దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు శివాజీ అన్న మాటల దుమారం ఇప్పట్లో ఆగేలా లేదు. మహిళల వస్త్రధారణ గురించి చాలా ఘాటు భాషలో ఆయన చేసిన కామెంట్స్ ఏకంగా మహిళా కమీషన్ రియాక్టయ్యి నోటీసులు ఇచ్చేదాకా వెళ్ళింది.
ఇండస్ట్రీలో ఉన్న లేడీ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ మూకుమ్మడిగా మా అసోసియేషన్ కు లేఖ రాశారు. ఇక్కడితో ఆగలేదు. పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో శివాజీ ధోరణిని తప్పుబడుతూ ట్వీట్లు పెట్టారు. ఇదంతా నిన్నటి దాకా స్టోరీ. ఇవాళ ప్రెస్ మీట్ లో శివాజీ మాట్లాడుతూ తను వాడిన పదాల గురించి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మరోసారి క్షమాపణ కోరారు.
ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ ఒకవేళ లులు మాల్ ఘటనలో నిధి అగర్వాల్ దుస్తుల్లో ఏదైనా జారి ఉంటే ఆ వీడియో జీవితాంతం ఉండిపోయేదని అనడం ద్వారా మరో చిన్నపాటి ఫైర్ రగిలించారు. నిజానికి ఆ సంఘటనలో నిధి బాధితురాలు. ఊహించని విధంగా ఫ్యాన్స్ తోసుకురావడంతో ఆమె చాలా ఇబ్బంది పడింది.
తనను ఉద్దేశిస్తూ ఒకవేళ బట్టల్లో ఏదైనా తొలగిపోయి ఉంటే అని మళ్ళీ గుర్తు చేయడం మరోసారి అభ్యంతరానికి దారి తీసేలా ఉంది. దీని గురించి ఇన్స్ టాలో నిధి అగర్వాల్ ఇన్ డైరెక్ట్ గా స్పందిస్తూ బాధితులనే నిందించడం మోసపూరితం అని అర్థం వచ్చేలా స్టేటస్ పెట్టడం గమనార్హం.
ఇది అంత ఈజీగా ఆగేలా కనిపించడం లేదు. అనసూయని ఉద్దేశించి శివాజీ మీ ఋణం తీర్చుకుంటానని చెప్పడం, పదాలు ముమ్మాటికీ తప్పే, భార్య దగ్గర బాధ పడ్డానని చెబుతూనే తన అసలు ఉద్దేశాన్ని విడమరిచి మళ్ళీ వివరించడం కొత్త వాదనలు తీసుకొచ్చేలా ఉంది.
పోలీసులు అడిగినా సరే లులు మాల్ సంఘటన మీద కేసు పెట్టడం ఇష్టం లేని నిధి అగర్వాల్ అక్కడితో దాన్ని సద్దుమణిగేలా చేద్దామనుకుంది. కానీ ఇప్పుడు వివరణ రూపంలో శివాజీ ఇచ్చిన సంజాయిషీ మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. దండోరా ప్రమోషన్ల సంగతేమో కానీ ఇది మాత్రం ఎక్స్ తదితర మాధ్యమాల్లో కొత్త చర్చలు పుట్టిస్తూనే ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates