అవతార్ నిప్పులను తక్కువంచనా వేయొద్దు

ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన సినిమాల లిస్టు తీస్తే ఖచ్చితంగా టాప్ త్రీలో ఉండే మూవీ అవతార్. మూడో భాగం డిసెంబర్ 19 పెద్ద ఎత్తున ఇండియాలోనూ విడుదల కానుంది. బుక్ మై షోలో 1.2 మిలియన్ల ఇంట్రెస్టులు నమోదు చేయడం చూస్తే దీని మీద ఎంత ఆసక్తి నెలకొందో అర్థం చేసుకోవచ్చు. ఎంత హాలీవుడ్ సినిమా అయినా దీన్ని తక్కువంచనా వేయడానికి లేదు. ఎందుకంటే ట్రేడ్ అంచనాల ప్రకారం మన దేశంలో 400 కోట్లు వసూలు చేయొచ్చని అంటున్నారు. హిట్ టాక్ వస్తే ఇదంతా మంచి నీళ్లు తాగినంత ఈజీగా లాగేస్తుంది. అడ్వాన్స్ బుకింగ్స్ అప్పుడే జోరు మీదున్నాయి.

ఇక విశేషాల విషయానికి వస్తే అవతార్ థర్డ్ పార్ట్ ఫైర్ అండ్ యాషెస్ పేరుతో వస్తోంది. దర్శకుడు జేమ్స్ క్యామరూన్ ఇందులో యాష్ పీపుల్ అనే కొత్త తెగను పరిచయం చేస్తున్నారు. పండోర ప్రపంచం యథావిధిగా కొనసాగుతుంది. దీనికైన బడ్జెట్ సుమారు 400 మిలియన్ డాలర్లని యుఎస్ మీడియా రిపోర్ట్. అంటే మన కరెన్సీలో 3500 కోట్ల పైమాటే. నిజానికి అవతార్ 2తో పాటే దీని షూటింగ్ కూడా చేశారు. కాకపోతే పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం అవసరం కావడం వల్ల టైం పట్టింది. ఇది బ్లాక్ బస్టర్ అయితే మిగిలిన రెండు భాగాలు తీస్తానని జేమ్స్ క్యామరూన్ చెబుతున్నారు. ఫ్లాప్ అయితే అవతార్ కథ సమాప్తం.

అవతార్ 2 ఇండియాలో పెద్ద సక్సెస్ కావడం అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్సులో 112 రోజులు నిరవధికంగా ప్రదర్శించడం ఇప్పటికీ రికార్డుగా ఉంది. దాన్ని ఫైర్ అండ్ యాష్ బ్రేక్ చేయొచ్చు. ముఖ్యంగా 3డి వెర్షన్ కు దేశవ్యాప్తంగా ఎక్కువ డిమాండ్ నెలకొంటోంది. ఇది దృష్టిలో పెట్టుకునే అఖండ 2 నిర్మాతలు డిసెంబర్ 19 ఆప్షన్ పెట్టుకోలేదని టాక్. ఉత్తరాదిలో వసూళ్లు బాగా రావాలంటే అవతార్ 3తో ఢీ కొట్టకూడదు. మల్టీప్లెక్సుల్లో షోలు దొరకవు. అందుకే 12కే ఫిక్స్ చేసుకున్నట్టు చెబుతున్నారు. చూడాలి ఈసారి జేమ్స్ క్యామరూన్ ఎలాంటి అద్భుతాన్ని చూపించబోతున్నారో.