రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ‘యురి’ దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన సినిమా.. దురంధర్. ప్రోమోలు చూస్తే ఇది బాలీవుడ్లో మరో ‘యానిమల్’ అవుతుందనే అంచనాలు కలిగాయి. కానీ రిలీజ్ ముంగిట ఈ సినిమాకు మరీ హైప్ ఏమీ కనిపించలేదు. కొన్ని కారణాల వల్ల నెగెటివిటీ కూడా ముసురుకుంది. ఏకంగా రూ.350 కోట్లు పెట్టి తీసిన సినిమా.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో అన్న సందేహాలు కలిగాయి.
ఈ చిత్రం కోసం దర్శకుడు ఆదిత్య ధర్ ప్రాణం పెట్టేశాడు. దీనికి నిర్మాత కూడా అతనే. హీరో రణ్వీర్ సింగ్ సైతం కెరీర్లో మరే చిత్రానికీ పడనంత కష్టం ఈ చిత్రానికి పడ్డాడు. దీంతో వీళ్ల కష్టానికి ఆశించిన ఫలితం వస్తుందా రాదా అనే చర్చ జరిగింది రిలీజ్ ముంగిట. కానీ ‘దురంధర్’ బాక్సాఫీస్ దగ్గర బలంగానే నిలబడ్డాడు. తొలి రోజు ఇండియాలో రూ.28 కోట్ల మేర వసూళ్లు రావడంతో హమ్మయ్య అనుకుంది టీం.
తర్వాతి రెండు రోజుల్లో ఇంకా వసూళ్లు పెరిగాయి. వీకెండ్లోనే ఇండియాలో వంద కోట్లకు పైగా కొల్లగొట్టింది ‘దురంధర్’. ఐతే వారాంతంలో జోరు చూపించే చాలా సినిమాలు.. వీక్ డేస్ రాగానే వీక్ అయిపోవడం మామూలే. కానీ ‘దురంధర్’ మాత్రం సోమవారం కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ఇండియాలో నాలుగో రోజు రూ.24.30 కోట్లు కొల్లగొట్టింది ఈ చిత్రం. సోమవారం ఇలాంటి వసూళ్లు రాబట్టిందంటే సినిమా బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోవచ్చు.
వరల్డ్ వైడ్ ఈ సినిమా వసూళ్లు రూ.180 దాకా ఉన్నాయి. మంగళవారం ఈ చిత్రం రూ.200 కోట్ల క్లబ్బులోకి అడుగు పెట్టబోతోంది. ఐతే ఈ సినిమా టార్గెట్ పెద్దది కాబట్టి నెలాఖరు వరకు బాగా ఆడాల్సిందే. హిందీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారంటే కొన్ని వారాల పాటు సినిమా ఆడుతుందనడంలో సందేహం లేదు. ఫుల్ రన్లో ఈ సినిమా వసూళ్లు రూ.400-500 కోట్ల మధ్య రావచ్చని ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates