నా కేసు క్లోజ్ చెయ్యడానికి 25 ఏళ్ళా… స్టార్ హీరో అసహనం

90వ దశకంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబయి పేలుళ్ల సందర్భంగా అక్రమంగా ఆయుధాలు దాచిపెట్టిన కేసులో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ అరెస్టవడం.. ఆ కేసు సుదీర్ఘ కాలం విచారణ దశలో ఉండడం.. కొన్నేళ్లు జైలు శిక్ష పూర్తి చేసుకుని 2016లో సంజయ్ దత్ విడుదల కావడం తెలిసిందే. ఈ కేసును పాతికేళ్ల పాటు విచారించడం పట్ల సంజయ్ దత్ అసహనం వ్యక్తం చేశాడు.

తన దగ్గర ఆయుధాలు లేకపోయినా దోషిగా ఐదేళ్లు జైలు శిక్ష అనుభవించానన్నాడు. తన ఇంట్లో ఒక్క తుపాకీ కూడా దొరక్కపోయినా తనను అరెస్ట్ చేశారని.. తన దగ్గర ఆయుధాలు లేవని నిరూపించడానికి 25 ఏళ్లు పట్టిందని దత్ ఆవేదన వ్యక్తం చేశాడు. జైలు జీవితాన్ని ఒక పాఠంగా భావించి.. అక్కడ ఎంతో నేర్చుకున్నట్లు సంజయ్ దత్ తెలిపాడు. 

‘‘నా దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవని తేల్చడానికి 25 ఏళ్లు ఎందుకు పట్టిందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. నా దగ్గర తుపాకీ ఉందని భావించి నన్ను అరెస్ట్ చేశారు. కానీ అది నిరూపించలేకపోయారు. నా జీవితంలో జరిగిన విషయాలకు ఇప్పుడు బాధ పడడం లేదు. కానీ నా తల్లిదండ్రులు నన్ను విడిచి త్వరగా వెళ్లిపోయారనే బాధ మాత్రం ఉంది.

నేను జైలు జీవితాన్ని ఒక పాఠంగా భావించా. ఎంతో హుందాగా ఎదుర్కొన్నాను. అక్కడ ఉన్నన్ని సంవత్సరాలు ఆధ్యాత్మికతకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాను. మత గ్రంథాలు చదివాను. న్యాయశాస్త్రం మీద అధ్యయనం చేశా. చట్టాల గురించి ఎంతో నేర్చుకున్నా. నా కేసును త్వరగా పరిష్కరించాలని ఎన్నోసార్లు అభ్యర్థించా. ఎంతోమంది చేయని నేరాలకు జైళ్లలో మగ్గుతున్నారని తెలుసుకున్నా’’ అని సంజయ్ దత్ చెప్పాడు.