కంగ‌నాతో పెట్టుకుని 5 ల‌క్ష‌లు సంపాదించాడు

బాలీవుడ్ బ‌డా బాబుల్ని దీటుగా ఎదుర్కొంటూ, సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ కంగ‌నా ర‌నౌత్ ఒక‌ప్పుడు వీర‌నారిలా క‌నిపించేది జ‌నాల‌కు. కానీ ఈ మ‌ధ్య కాలంలో ఆమె విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు శ్రుతి మించిపోయాయి. ప్ర‌తి అంశంలోనూ వేలు పెట్టి అవ‌త‌లి వాళ్ల‌పై అభాండాలు వేయ‌డం, కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ స‌ర్కారుకు అనుకూలంగా భ‌జ‌న చేయ‌డం ద్వారా ఆమె విమ‌ర్శ‌ల పాల‌వుతోంది.

కొన్ని విష‌యాల్లో ఆమె అన‌వ‌స‌ర జోక్యం చాలామందిలో వ్య‌తిరేక‌త పెంచింది. ఇక సెల‌బ్రెటీల విష‌యానికొస్తే ఆమె నోటికి భ‌య‌ప‌డి చాలామంది త‌న జోలికి వెళ్ల‌ట్లేదు కానీ.. అప్పుడ‌ప్పుడూ కొంద‌రు ఆమెను దీటుగా ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆ జాబితాలోకి పంజాబీ న‌టుడు దిల్జిత్ దోసాంజ్ చేరాడు.

మోడీ స‌ర్కారుకు వ్య‌తిరేకంగా ఆందోళ‌న చేస్తున్న రైతుల్లో క‌నిపించిన ఓ వృద్ధ మ‌హిళ పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ కంగ‌నా చేసిన వ్యాఖ్య‌ల‌తో మండిపోయిన దిల్జిత్.. కంగ‌నాకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు. పదునైన వ్యాఖ్య‌ల‌తో ఆమెకు కక్క‌లేని మింగ‌లేని ప‌రిస్థితి క‌ల్పించాడు. ఎప్పుడూ ఎదుటివారి మీద ఎదురు దాడి చేసే కంగ‌నా.. దిల్జిత్‌కు స‌మాధానం చెప్ప‌డంలో త‌డ‌బ‌డింది. ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిపోయింది. దీంతో దిల్జిత్ సోష‌ల్ మీడియా హీరో అయిపోయాడు. ఒక్క‌సారిగా అత‌ను ట్విట్ట‌ర్లో ట్రెండ్ అయ్యాడు. సోష‌ల్ మీడియాలో అత‌డికి ఫాలోయింగ్ పెరిగిపోయింది. కంగ‌నాతో పెట్టుకున్న కేవ‌లం మూడు రోజుల్లోనే అత‌డి ఫాలోవ‌ర్ల సంఖ్య 5 ల‌క్ష‌ల‌కు పైగా పెరిగిపోవ‌డం విశేషం. ఈ పెరుగుద‌ల ఇలాగే కొన‌సాగుతోంది.

ఆందోళ‌న‌ల్లో పాల్గొన్న రైతులకు చ‌లి కోట్లు కొన‌డం కోసం దిల్జిత్ కోటి రూపాయ‌లు విరాళం ఇవ్వ‌డం, దాని గురించి అత‌ను ప్ర‌చారం కూడా చేసుకోక‌పోవ‌డం, వేరే వ్య‌క్తి ద్వారా ఆ విష‌యం వెల్ల‌డి కావ‌డం కూడా అత‌డి ఇమేజ్‌ను బాగా పెంచింది. ప్ర‌స్తుతం అత‌డి పాలోవ‌ర్ల సంఖ్య 4.4 మిలియ‌న్లు. అతి త్వ‌ర‌లోనే అది 5 మిలియ‌న్ మార్కును అందుకునేలా క‌నిపిస్తోంది.