శాశ్వత సెలవు తీసుకున్న ధర్మేంద్ర

బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర చివరి శ్వాస తీసుకున్నారు. కొద్దిరోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత ఇంటికి డిశ్చార్జ్ అయిన అతి తక్కువ సమయంలో తిరిగి వ్యాధి తిరగబడటంతో ఈసారి పోరాడలేకపోయారు. ప్రముఖ దర్శకుడు నిర్మాత కరణ్ జోహార్ ఈ కఠిన వాస్తవాన్ని ఇన్స్ టా వేదికగా ప్రకటించడంతో అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. ధర్మేంద్ర వయసు 90 సంవత్సరాలు. దేశ విభజనకు ముందు 1935 డిసెంబర్ 8 ఇప్పటి పంజాబ్ రాష్ట్రం నస్రాలి అనే గ్రామంలో జన్మించారు. ఆయన పూర్తి పేరు ధరమ్ సింగ్ డియోల్. కేవల్ కిషన్ సింగ్, సత్వంత్ కౌర్ తల్లితండ్రులు.

1960లో ఫిలిం ఫేర్ నిర్వహించిన న్యూ టాలెంట్ పురస్కారానికి ఎంపికైన తర్వాత నటుడిగా ఎదిగేందుకు ధర్మేంద్ర బొంబాయికి వచ్చేశారు. దిల్ భీ తేరా హమ్ భీ తేరాతో మొదటిసారి స్క్రీన్ మీద కనిపించారు. ఆ తర్వాత ఏడేళ్ల పాటు రొమాంటిక్ హీరోగా గుర్తింపు పొందారు. సూరత్ ఔర్ సీరత్, బాందిని, పూజా కే ఫుల్, అయే మిలన్ కి బేలా, మై భీ లడ్కీ హూ, కాజల్, పూర్ణిమా లాంటి సూపర్ హిట్స్ ధర్మేంద్ర ఖాతాలో చేరాయి. సోలో హీరోగా మారింది మాత్రం 1966లో వచ్చిన పూల్ ఔర్ పత్తర్ నుంచి. చుప్కే చుప్కే, దిల్లగి, రాజా జానీ, షరాఫత్ లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన హేమామాలినిని రెండో వివాహం చేసుకున్నారు.

1975లో షోలేలో చేసిన వీరు పాత్ర ధర్మేంద్రకు సరికొత్త మాస్ ఇమేజ్ తో కమర్షియల్ మార్కెట్ సృష్టించింది. ధరమ్ వీర్, చరస్, ఆజాద్, రాజ్ పుత్, భగవత్, హుకుమత్, రాజ్ తిలక్ లాంటి బ్లాక్ బస్టర్లు తిరుగులేని మాస్ ఫాలోయింగ్ సంపాదించి పెట్టాయి. అమితాబ్ నుంచి తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ తన సత్తా చాటేవారు. 1989 నుంచి సల్మాన్, షారుఖ్, అమీర్ లాంటి కొత్త తరం వచ్చాక ధర్మేంద్ర నెమ్మదించారు. ఇద్దరు కొడుకులు సన్నీ డియోల్, బాబీ డియోల్ పెద్ద స్థాయికి చేరుకున్నారు. ఈషా డియోల్ హీరోయిన్ గా రాణించింది. 2012లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ తో గౌరవించింది. బీజేపీ తరఫున 2013లో ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయంగానూ విజయం అందుకున్నారు. ధర్మేంద్ర లేని లోటు అభిమానులకే కాదు యావత్ ప్రేక్షక లోకానికి తీరని లోటు.