డిసెంబర్ 5 విడుదల కాబోతున్న అఖండ తాండవం 2 కు ముందు రోజే ప్రీమియర్లు వేయడం దాదాపు ఖాయమైనట్టే. ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి ఇబ్బందులు లేవు. కాకపోతే ఓజి తరహాలో టికెట్ రేట్ వెయ్యి రూపాయలు పెట్టాలా లేక ఆరేడు వందల మధ్యలో నిర్ణయించాలానే దాని మీద డిస్ట్రిబ్యూటర్లు తర్జన భర్జన పడుతున్నారట. ఎందుకంటే అఖండ 2 మీద అంచనాలు ఉన్న మాట వాస్తవమే కానీ మరీ ఓజి స్థాయిలో కాదు. పైగా ఇప్పటిదాకా వదిలిన రెండు పాటలు హిట్టయినా చెప్పుకునే రేంజ్ లో వైరల్ కాలేదు. నిన్న వదిలిన ట్రైలర్ లో మాస్ స్టఫ్ ఫుల్లుగా ఉంది కానీ హడావిడి ఎక్కువైపోవడంతో కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ ఉంది.
అయితే బోయపాటి శీనుని తక్కువంచనా వేయడానికి లేదు. థియేట్రికల్ గా తనిచ్చే హై మాములుగా లేదు. స్కంద ఫ్లాప్ అయినా సరే కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ గురించి సోషల్ మీడియాలో ఇప్పటికీ చెప్పుకుంటారు. వినయ విధేయ రామకు సంవత్సరాల తరబడి భారీ టిఆర్పి వచ్చింది. డిజాస్టర్లకే అంత రెస్పాన్స్ తెచ్చుకున్న బోయపాటి తనకు మూడు ఇండస్ట్రీ హిట్ అవకాశాలు ఇచ్చిన బాలయ్యని ఆషామాషీగా చూపించడుగా. ఈ విషయాన్ని సింహా. లెజెండ్, అఖండ ఆల్రెడీ ఋజువు చేశాయి. ఇక అఖండ 2 ఏ రేంజులో ఉంటుందో వేరే చెప్పాలా. నందమూరి ఫ్యాన్స్ నమ్మకం అదే.
ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇకపై టికెట్ హైక్స్ కావాలంటే సినీ కార్మికులకు పాతిక శాతం ఫండ్ ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సన్మాన సభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి అఖండ 2 నైజాం హక్కులు కొన్న దిల్ రాజు ఫిలిం ఫెడరేషన్ చైర్ మెన్ గా ఎలాంటి ప్రతిపాదన ఇస్తారో వేచి చూడాలి. మొత్తానికి ముందే రోజే బాలయ్య అభిమానులకు పండగ వాతావరణం రాబోతోంది. అధికారికంగా ప్రీమియర్లకు సంబందించిన ప్రకటన రావడానికి ఇంకా టైం పట్టొచ్చు. బోయపాటి శీను టీమ్ మాత్రం చాలా నమ్మకంగా ఉంది. మరో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ కి అఖండ 2 శ్రీకారం చుడుతుందనే ధీమాలో ఉన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates