ప్రభాస్ కన్నడిగుడా?

ప్రభాస్ పక్కా తెలుగువాడని అందరికీ తెలుసు. కానీ అతణ్ని ‘‘వెల్కమ్ టు హోమ్’’ అంటూ కర్ణాటకకు ఆహ్వానిస్తూ కన్నడ సూపర్ స్టార్లలో ఒకడైన పునీత్ రాజ్‌కుమార్ ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇది కన్నడిగులకు అస్సలు నచ్చట్లేదు. ప్రభాస్ ఏమైనా కన్నడిగుడా వెల్కమ్ టు హోమ్ అని ఆహ్వానించడానికి అంటూ అతడి మీద విరుచుకుపడిపోతున్నారు కన్నడ నెటిజన్లు.

ఇప్పటికే వాళ్లకు దర్శకుడు ప్రశాంత్ నీల్ మీద పీకల దాకా కోపం ఉంది. ‘కేజీఎఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించిన ప్రశాంత్‌ నీల్‌తో పని చేయడానికి వివిధ ఇండస్ట్రీల స్టార్లు ఆసక్తి చూపించారు. వారిలో ప్రశాంత్‌ను ఎక్కువ ఆకర్షించింది టాలీవుడ్ స్టార్లే. ఇంతకుముందు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో జూనియర్ ఎన్టీఆర్‌ సినిమాకు కమిట్మెంట్ ఇచ్చిన ప్రశాంత్.. ఇప్పుడు ఏకంగా ప్రభాస్‌తో సినిమానే అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచాడు.

తారక్‌తో సినిమాకు సంబంధించి ఇంతకుముందు హింట్ ఇచ్చిన సమయంలో ప్రశాంత్ మీద కన్నడిగులు తీవ్ర ఆగ్రహం చూపించారు. కన్నడలో పేరు సంపాదించగానే ఇక్కడి హీరోలు అతడికి కనిపించకుండా పోయారని.. టాలీవుడ్ స్టార్లతో సినిమాలు చేయడానికి తహతహలాడిపోతున్నాడని అతడిపై విరుచుకుపడ్డారు. గెట్ లాస్ట్ ప్రశాంత్ అంటూ హ్యాష్ ట్యాగ్స్ పెట్టి నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో వెల్కం టు టీఎఫ్ఐ ప్రశాంత్ అంటూ మన వాళ్లు అతడికి ఆహ్వానం పలికారు. తర్వాత వ్యవహారం సద్దుమణిగింది. ఇప్పుడు ప్రభాస్‌తో సినిమా అనౌన్స్ చేయగానే మరోసారి రచ్చ మొదలైంది. ప్రశాంత్‌ మీద మరోసారి తమ ఆగ్రహాన్ని చూపిస్తున్నారు కన్నడిగులు.

అంతటితో ఆగకుండా ‘సలార్’ ఫస్ట్ లుక్‌ను షేర్ చేస్తూ ప్రభాస్‌ను ఓన్ చేసుకునే ప్రయత్నం చేసిన పునీత్ మీద కూడా తమ కోపాన్ని చూపిస్తున్నారు. ఐతే కన్నడ సినిమా ఇప్పుడే కాస్త బౌండరీలు దాటి వేరే చోట్ల ప్రభావం చూపే పరిస్థితులు వస్తున్నాయి. ‘కేజీఎఫ్’ ఇందుకు బాటలు వేసింది. పునీత్ కొత్త సినిమా ‘యువరత్న’ను కూడా తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ప్రయోజనాల రీత్యా ప్రభాస్‌‌ గురించి పునీత్ ట్వీట్ వేసినట్లున్నాడు. మిగతా కన్నడ స్టార్లు సైతం కన్నడనాట అవతల మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నారు. అదర్థం చేసుకోకుండా కన్నడ ఫ్యాన్స్ ఇలా తమ ఆగ్రహాన్ని చూపిస్తే ఏం ప్రయోజనం?