బాహుబలి ఎటర్నల్… ఫ్యాన్స్ హ్యాపీనా

బాహుబలి ది ఎపిక్ విడుదల సందర్భంగా ప్రత్యేకంగా థియేటర్లలో స్క్రీన్ చేసిన బాహుబలి ది ఎటర్నల్ వార్ టీజర్ గురించి ఫ్యాన్స్ మధ్యలో పెద్ద చర్చ జరుగుతోంది. రాజమౌళి దీనికి దర్శకత్వం వహించకపోయినా పర్వవేక్షణ చేస్తారు కాబట్టి ఆయన బ్రాండ్ మీదే థియేటర్ బిజినెస్, ఓటిటి డీల్స్ జరుగుతాయని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. విఎఫెక్స్ నిపుణుడు ఇషాన్ శుక్లా దర్శకత్వం వహించబోయే ఎటర్నల్ వార్ లో మహేంద్ర బాహుబలి చనిపోయాక జరిగే పరిణామాలు, దేవుళ్ళు రాక్షసులు మధ్య జరిగే యుద్ధాలు, శివుడి మహత్యం మీద మరిన్ని ఎపిసోడ్లు వెరసి పెద్ద ఎత్తున కంటెంట్ సిద్ధం చేస్తున్నారు.

ప్రభాస్ ఫ్యాన్స్ దీని పట్ల ఏమంత ఎగ్జైటెడ్ గా లేరని సోషల్ మీడియా రెస్పాన్స్ చూస్తే అర్థమవుతోంది. బాహుబలి అనే బ్రాండ్ ని ప్రభాస్ ద్వారా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి ఇప్పుడీ యానిమేషన్ ద్వారా దాని ఒరిజినాలిటిని తగ్గించిన వారవుతారని ఫీలవుతున్నారు. గతంలో బాహుబలి ప్రీక్వెల్ ని  వెబ్ సిరీస్ గా తీయాలని క్యాస్టింగ్ ఎంచుకుని కొంత భాగం షూటింగ్ చేశాక ఆపేసిన సంగతి రెగ్యులర్ మూవీ లవర్స్ కు బాగా తెలుసు. నెట్ ఫ్లిక్స్ సైతం ఒక కార్టూన్ ప్రాజెక్ట్ అనుకుని తర్వాత డ్రాప్ అయ్యింది. ఇప్పుడు హఠాత్తుగా ఎటర్నల్ వార్ పేరుతో అనౌన్స్ మెంట్ రావడం ఆశ్చర్యమే.

బహుశా మహావతార్ నరసింహకు వచ్చిన స్పందన చూశాక నిర్మాతలకు ఉత్సాహం వచ్చి ఉండొచ్చు. అయితే ఒక లాండ్ మార్క్ గా నిలిచిపోయిన మూవీకి యానిమేషన్ కొనసాగింపు ఇవ్వడం ఎంతమేరకు సరైన నిర్ణయమనేది 2027లో తేలనుంది. అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. ప్రభాస్ పోలికలతో హీరో క్యారెక్టర్ డిజైన్ చేయడం, డార్లింగ్ తోనే స్వంతంగా డబ్బింగ్ చెప్పించే ప్రయత్నాలు చేయడం లాంటివి ఎటర్నల్ వార్ మీద ఆసక్తి పెంచే అవకాశాలు లేకపోలేదు. కాకపోతే పదే పదే అదే పేరుతో ఇలా కొనసాగింపులు చేయడం ఎంతవరకు భావ్యం అనేది కాలమే నిర్ణయిస్తుంది. అప్పటిదాకా వెయిట్ అండ్ సీ.