రాజమౌళిని భయపెట్టిన వాట్సాప్ గ్రూపు

‘మగధీర’ దగ్గర్నుంచి తన ప్రతి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని కొన్ని మెట్లు ఎక్కిస్తూ సాగాడు రాజమౌళి. ‘బాహుబలి’తో మొత్తంగా ఇండియన్ సినిమానే తీసుకెళ్లి ప్రపంచ స్థాయిలో నిలబెట్టాడు. ఆ చిత్రానికి సన్నాహాలు మొదలైనపుడు తెలుగు సినిమా స్థాయి చాలా తక్కువ. అప్పటి ఇండస్ట్రీ హిట్ అయిన ‘మగధీర’ రూ.80 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే.. దాని మీద రూ.40 కోట్లు ఎక్కువ, అంటే రూ.120 కోట్ల బడ్జెట్లో ఈ సినిమాను మొదలుపెట్టింది చిత్ర బృందం. 

ఐతే ఆ బడ్జెట్‌ను వర్కవుట్ చేయగలమనే నమ్మకంతోనే సినిమాను మొదలుపెట్టారు. తర్వాత సినిమా రెండు భాగాలైంది. ముందు అనుకున్న దాంతో పోలిస్తే రెట్టింపు కన్నా ఎక్కువకు బడ్జెట్ పెరిగిపోయింది. ఇంత సాహసోపేతంగా సినిమా తీసి రిలీజ్ చేస్తే.. ముందు రోజు అర్ధరాత్రి ప్రిమియర్స్ నుంచి డివైడ్ టాక్ వచ్చింది. అప్పుడు తనతో పాటు టీం అంతా ఎంత టెన్షన్ అనుభవించిందో ‘బాహుబలి: ది ఎపిక్’ రీ రిలీజ్ సందర్భంగా ప్రభాస్, రానాలతో కలిసి చేసిన ఇంటర్వ్యూలో రాజమౌళి వెల్లడించాడు.

‘‘సినిమా మీద నమ్మకంతో భారీ బడ్జెట్ పెట్టేశాం. దాన్ని వర్కవుట్ చేయగలమనే అనుకున్నాం. కానీ ఆ చిత్రం డెఫిషిట్‌తో రిలీజైంది. శోభు గారు పైకి రూ.20 కోట్ల డెఫిషిట్ అన్నారు. కానీ వాస్తవానికి అది రూ.40 కోట్లు. తీరా ముందు రోజు అర్ధరాత్రి ప్రిమియర్స్ వేస్తే వాటి నుంచి నెగెటివ్ టాక్ వచ్చింది. అంతకంతకూ డివైడ్ టాక్ పెరిగింది. వదినను అనుకోకుండా ఒక జర్నలిస్ట్ గ్రూప్‌లో ఎవరో యాడ్ చేశారు. ఆమె అందులో ఉన్నట్లు వాళ్లకు తెలియదు. ఫస్ట్ షో అవ్వగానే ఎవరో ప్రభాస్ శివలింగాన్ని ఎత్తే ఫొటోను ఎడిట్ చేసి శివలింగం బదులు జండూబామ్ పెట్టి పోస్ట్ చేశారు. ఇది బాహుబలి కాదు.. ప్రొడ్యూసర్ బలి, డిస్ట్రిబ్యూటర్లు బలి, ప్రేక్షకులు బలి అంటూ కొందరు కామెంట్లు చేశారు. 

ఇలా అన్నీ నెగెటివ్ కామెంట్లు రావడంతో వదిన కంగారు పడిపోయారు. మాకు వెంటనే చెప్పలేదు. తర్వాత అవి చూపించారు. మాకు ఈ టాక్ ఏంటని అర్థం కాలేదు. దర్శకుడిగా నాకేం ఇబ్బంది లేదు. ఇంకో సినిమాతో రికవర్ అయిపోతాను. కానీ నిర్మాతలు ఏమైపోతారని నా భయం. అవసరమైతే మన ఆస్తులు కూడా అమ్ముదాంలే అని లెక్కలు చూసుకున్నాం. కానీ మనం బ్యాడ్ సినిమా తీయలేదు కదా, బాగా ఆడుతుందిలే అని లోలోన నమ్మకం ఉంది.

తర్వాత డిస్ట్రిబ్యూటర్ సాయిగారిని కలిశాను. సెకండ్ పార్ట్ ఏం చేయాలి అని మాట్లాడుకున్నాం. ఆయన ముంబయి నుంచి ఫైనాన్షియర్లను తీసుకొచ్చి ఇంకో 70 కోట్లు పెట్టి రెండో భాగం పూర్తి చేసేద్దాంలే అని ధైర్యం చెప్పారు. తర్వాత సినిమా పరిస్థితి ఏంటా అని వాకబు చేస్తే.. సాయంత్రానికి రెస్పాన్స్ మామూలుగా లేదని సాయి గారు చెప్పారు. సినిమా బాలేకుంటే కలెక్షన్లు పెరగవని.. టికెట్లు సర్దుబాటు చేయడం కష్టంగా ఉందని… భయపడాల్సిన పనేమీ లేదని భరోసా ఇచ్చారు. అయినా రెండు మూడు రోజులు చూద్దామని ఆగాం. కానీ సినిమా ఎక్కడా తగ్గలేదు. ఎక్కడికో వెళ్లిపోయింది’’ అని రాజమౌళి అప్పటి టెన్షన్‌ను గుర్తు చేసుకున్నాడు.