వివాదం కాదు విచక్షణ కావాలి

ఈ మధ్య కొత్త రిలీజుల ప్రెస్ మీట్లలో  వివాదం కోసమో లేదా నలుగురిలో హైలైట్ కావడం కోసమో సినిమా సభ్యులను ఇబ్బందికర ప్రశ్నలు అడిగే ప్రహసనం తరచుగా కనిపిస్తోంది. గతంలో డీజే టిల్లు టైంలో నేహా శెట్టిని ఇబ్బందికరమైన క్వశ్చన్ అడగటం సోషల్ మీడియాలో చిన్నపాటి సెన్సేషన్ అయ్యింది. తాజాగా తెలుసు కదా ఈవెంట్ లో ఒక లేడీ జర్నలిస్టు సిద్ధూ జొన్నలగడ్డను ఉద్దేశించి మీరు విమెనైజరా అని అడగటం చాలా ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చింది. ఈవిడే కొద్దీ రోజుల క్రితం ప్రదీప్ రంగనాథన్ ని ఉద్దేశించి మీరు హీరో మెటీరియల్ కాదనే తరహాలో ప్రశ్న అడగటం పక్క రాష్ట్రంలో కూడా నెగటివ్ అయ్యింది.

ఇది మొదటిసారి కాదు చివరిసారి కాబోదు. కాకపోతే ఎంత మీడియా అయినా సరే నటీనటులతో మాట్లాడేటప్పుడు కాసింత విచక్షణ అవసరం. ఇండస్ట్రీ, మీడియాది ఇచ్చిపుచ్చుకునే పాలసీ. అంటే కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే దాన్ని జనంలోకి తీసుకెళ్లడాన్ని ఒక బాధ్యతగా నిర్వహించే వ్యాపారం మీడియాది. అంతమాత్రాన ఒకరిమీద మరొకరికి అధికారం, హక్కులు లాంటివి ఉండవు. అలాంటిది ఇంటర్వ్యూలు ఇవ్వడానికి లేదా సమాధానాలు చెప్పడానికి వచ్చిన హీరో హీరోయిన్లను ఇబ్బంది పెట్టే కామెంట్లతో సాధించేది ఏమి ఉండదు. ఇది గుర్తించిన నాడు మళ్ళీ ఇవి రిపీటయ్యే ఛాన్స్ ఉండదు.

ఇక్కడ టాలీవుడ్ పెద్దలు, జర్నలిస్టు సంఘాలు ఏం చేయాలనే దానికన్నా ముందు మాటల్లో దొర్లే తప్పులు ఎంత తీవ్ర అర్థాలకు, పరిణామాలకు దారి తెస్తాయో గుర్తించడం అవసరం. ఇలాంటివి జరుగుతున్నందుకే ప్రెస్ మీట్లలో కెమెరాలు కేవలం స్టేజి వైపుకు పెట్టేసి మీడియా ప్రతినిధులను చూపించడం మానేశారు. ఇది ఒకరకమైన అవమానమని అనిపించినా ఎవరు ఏమీ అనలేని పరిస్థితి. ఇటీవలే మంచు లక్ష్మి ఒక ఇంటర్వ్యూలో తనకు జరిగిన అవమానం మీద బహిరంగ లేఖ విడుదల చేస్తే వ్యవహారం క్షమాపణ దాకా వెళ్ళింది. సో ఇకపై మళ్ళీ ఇవి రిపీట్ కాకూడదంటే  జాగ్రత్తగా ఉండటం తప్ప వేరే మార్గం లేదు.