చెప్పాపెట్టకుండా నాగార్జున వందో సినిమా మొదలైపోయింది. మాములుగా ఇంత పెద్ద సీనియర్ హీరో తన జీవితంలో మైలురాయి లాంటి మూవీని ఆర్భాటంగా మొదలుపెడతారు. పైగా రెండో తరం స్టార్లలో తను మూడోవాడిగా ఈ ఘనత అందుకున్నారు. 1988 చిరంజీవి త్రినేత్రుడుతో, 2017 బాలకృష్ణ గౌతమీపుత్రశాతకర్ణితో ఈ లాంఛనం పూర్తి చేశారు. వెంకటేష్ ఇంకో పాతిక సినిమాల దూరంలో ఉన్నారు కాబట్టి కౌంట్ లోకి తీసుకోలేం. ఇప్పుడున్న హీరోల్లో ఇంకెవరూ సెంచరీ చేయడం అసాధ్యమన్నది అందరికీ తెలిసిన విషయమే. మరి ఇలాంటి జ్ఞాపకాన్ని నాగార్జున ఎందుకింత సింపుల్ గా కానిచ్చారనే డౌట్ రావడం సహజం.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇప్పుడు సౌండ్ చేయడం కన్నా షూటింగ్ ఒక కొలిక్కి వచ్చాక టైటిల్ లాంచ్ లేదా టీజర్ రిలీజ్ ద్వారా ఈ వందో సినిమా ప్రమోషన్లను మొదలుపెట్టాలనే ఉద్దేశంతో ఇలా కానిచ్చేశారని తెలిసింది. ఈ మధ్య అక్కినేని అభిమానులు నాగార్జున కథల ఎంపిక పట్ల అసంతృప్తిగా ఉన్నారు. కమర్షియల్ గా ఏ స్థాయికి వెళ్లాయనేది పక్కనపెడితే కూలి, కుబేర రెండింటిలోనూ చనిపోయే పాత్రలు చేయడం వాళ్ళకేమాత్రం నచ్చలేదు. అందులోనూ పాత డెన్ బాస్ టైపులో రజనీకాంత్ చేతిలో ప్రాణాలు కోల్పోవడం సగటు మూవీ లవర్స్ సైతం యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఇదంతా నాగార్జున నోటీస్ కు వెళ్ళింది.
సో ముందు ఫ్యాన్స్ ని సంతృప్తి పరచడం తనముందున్న లక్ష్యం. నాగచైతన్య కెరీర్ పరంగా కుదురుకున్నప్పటికీ అఖిల్ ఇంకా బ్రేక్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. కొడుకుల సంగతి ఎలా ఉన్నా ఫ్యాన్స్ వరకు నాగ్ ఒక బలమైన ఎమోషన్. సోగ్గాడే చిన్న నాయనా, బంగార్రాజు తరహా హిట్స్ కొట్టే ఎంటర్ టైనర్స్ కోసం ఎదురు చూస్తున్నారు. తమిళ దర్శకుడు కార్తీక్ కి తన వందో సినిమా ఇచ్చారంటే అందులో కంటెంట్ బలంగానే ఉంటుందని నమ్ముతున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్లతో పాటు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రధాన ఆకర్షణగా ఉంటుందని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates