నిన్న హైదరాబాద్ లో జరిగిన కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో కం దర్శకుడు రిషబ్ శెట్టి పూర్తిగా కన్నడలో మాట్లాడ్డం సోషల్ మీడియాలో మిస్ ఫైర్ అయ్యింది. ఓ రెండు ముక్కలు తెలుగులో కానిచ్చి, ఆ తర్వాత కాసేపు కన్నడ, కాసేపు ఇంగ్లీష్ లో మాట్లాడినా అయిపోయేది. కానీ వేడుక చూస్తున్న వాళ్లలో అత్యధిక శాతం అర్థం కాని కన్నడలో ప్రసంగిచడమే నెగటివిటీకి దారి తీసింది. వేదిక మీద ఉన్న వాళ్లలో రిషబ్ మాట్లాడేది స్పష్టంగా అర్థమయ్యింది ఒక్క జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రమే. మిగిలిన వాళ్లలో ఎంత మందికి ఆ లాంగ్వేజ్ వస్తుందంటే బహుశా సమాధానం సింగిల్ డిజిట్ లోనే ఉండొచ్చు.
ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటుంది. హైదరాబాద్ లో తమిళ, మలయాళం సినిమాలు ఆడినంతగా కన్నడ చిత్రాలు వర్కౌట్ అయిన దాఖలాలు తక్కువ. కెజిఎఫ్, కాంతార లాంటివి అనువాదాల రూపంలోనే మనల్ని మెప్పించాయి. ఇంతకు ముందు పలు సందర్భాల్లో రిషబ్ శెట్టి అరకొర తెలుగు మాట్లాడాడు. ఇప్పుడూ అదే చేసుంటే సరిపోయేది. తమిళంలో ఇంటర్వ్యూలు అక్కడి మాతృ భాషలో ఇచ్చి ఇక్కడ మాత్రం ఇలా చేయడం ఏమిటనే ప్రశ్న తలెత్తుతుంది. మనస్ఫూర్తిగా తన మనసులో మాటలు పంచుకోవడానికి కన్నడ వాడతానని రిషబ్ ముందే డిస్క్లైమర్ ఇచ్చాడు కానీ లాభం లేకపోయింది.
నిజానికి ఈ ఇష్యూ ఇంతగా హైలైట్ కావడం వెనుక కారణముంది. ఇటీవలే బెంగళూరులో ఓజి ప్రీమియర్లను కొందరు కన్నడ మద్దతుదారులు అడ్డుకున్నారు. ఈ ఆగ్రహం పవన్ ఫ్యాన్స్ తో పాటు సగటు టాలీవుడ్ ప్రియుల్లో ఉంది. దీనికి తోడు కాంతారా చాప్టర్ 1కి టికెట్ రేట్ల పెంపు కోసం ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు అప్లికేషన్ పెట్టుకున్నారనే వార్త మరింత ఆగ్రహానికి దారి తీసింది. డబ్బింగ్ మూవీకి హైక్స్ ఎందుకు ఇవ్వాలనేది వాళ్ళ ప్రశ్న. మొత్తానికి రిషబ్ శెట్టి ఊహించని విధంగా కార్నర్ కావడం చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. రిలీజ్ ఇంకో మూడు రోజుల్లో ఉన్న నేపథ్యంలో ఈ పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates