ఓజి… కొంచెం టికెట్ ధరలు దేఖోజీ

బాక్సాఫీస్ వద్ద ఓజి ర్యాంపేజ్ కొనసాగుతోంది. మొదటి రోజే నూటా యాభై నాలుగు కోట్ల గ్రాస్ దాటేసిన ఓజస్ గంభీర అప్పుడే వంద కోట్ల షేర్ దాటడం పట్ల అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. యుఎస్ లో 4 మిలియన్ల మార్కు దాటిన ఓజి అంత ఈజీగా నెమ్మదించేలా లేడు. అయితే ఇవన్నీ ఆనందించే విషయాలే అయినా ఆలోచించించాల్సిన పాయింట్ మరొకటి ఉంది. అదే పెంచిన టికెట్ ధరలు. ఏపీ తెలంగాణలో సింగల్ స్క్రీన్ కు 125, మల్టీప్లెక్సుకు 150 రూపాయలు ప్రతి టికెట్ కు పెంచుకునే అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రీమియర్ షోలకు వెయ్యి పెట్టినా అభిమానులు లెక్క చేయలేదు. అది వేరే విషయం.

ఇకపై ఓజి రన్ కి కామన్ ఆడియన్స్ మద్దతు కావాలి. పెంచిన రేట్ల దెబ్బకు తక్కువాదాయం ఉన్న ప్రేక్షకులు థియేటర్లకు దూరంగా ఉన్నారు. ఇద్దరు చూడాల్సిన డబ్బులకు ఒక్క టికెటే రావడం వాళ్ళను ఆలోచించుకునేలా చేస్తోంది. ఇది మారాలంటే తగ్గింపు దిశగా చర్యలు తీసుకోవాలి. వీకెండ్ కాబట్టి మంచి అవకాశాన్ని పోగొట్టుకోవడం ఎందుకనుకుంటే కనీసం సోమవారం నుంచైనా ధరలను సాధారణ స్థితికి తెస్తే ఆక్యుపెన్సీలు ఊపందుకుంటాయి. ఇప్పుడు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా వీకెండ్స్ లో డ్రాప్ శాతం ఎక్కువ లేకుండా చూసుకోవాలి. అసలే భీకర వర్షాలు జనాన్ని ఇళ్లనుంచి కదలకుండా చేస్తున్నాయి.

తక్కువ జనాభా ఉండే సి సెంటర్లలో ఆల్రెడీ రేట్లు తగ్గించేశారనే టాక్ ట్రేడ్ వినిపిస్తోంది. ఇది మిగిలిన ప్రాంతాలకు వర్తింపజేయాలి. మండే నుంచి ఒక కార్యాచరణ రూపొందించాలి. మిరాయ్ మూడో వారంలోనూ బలంగా ఉండడానికి ప్రధాన కారణం ఒక్క రూపాయి పెంచకుండా రెగ్యులర్ రేట్లతోనే మొదటి రోజు నుంచి షోలు వేయడం. బడ్జెట్ పరంగా ఓజి ఎక్కువే అయినప్పటికీ ధరలు నార్మల్ గా ఉంటే ఎక్కువ శాతం పబ్లిక్ పవన్ కళ్యాణ్ కోసం థియేటర్ కు వస్తారు. అందులోనూ పాజిటివ్ టాక్ ఉన్నప్పుడు ఆ తాకిడి తీవ్రంగా ఉంటుంది. మరీ పది రోజులు కాకుండా కాస్త త్వరగా టికెట్ రేట్ల ఊరట కలిగిస్తే మంచిదేమో.