దృశ్యం దర్శకుడు నిరాశపరిచారు

మలయాళం దర్శకుడే అయినా జీతూ జోసెఫ్ మీద తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి కార్నర్ ఉంది. వెంకటేష్ దృశ్యం 2ని డైరెక్ట్ చేసింది ఈయనే. ఫ్యామిలీ థ్రిల్లర్స్ లో ఒక కొత్త ఒరవడి సృష్టించిన ఈ క్రియేటివ్ జీనియస్ ది మలుపులు రాసుకోవడంలో అందె వేసిన చేయి. మోహన్ లాల్ నేరు అనే మూవీ మన దగ్గర థియేటర్లలో రిలీజ్ కాకపోయినా ఓటిటిలో చూసిన తెలుగు ఆడియన్స్ అందులో ట్విస్టులకు థ్రిల్ అయ్యారు. దృశ్యం 3కి ఏర్పాట్లు జరుగుతున్న టైంలో జీతూ జోసెఫ్ కొత్త సినిమా మిరేజ్ మొన్న శుక్రవారం విడుదలయ్యింది. అసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి జంటగా దీని మీద మంచి అంచనాలే నెలకొన్నాయి.

అనూహ్యంగా మిరేజ్ అంచనాలు అందుకోవడంలో తడబడింది. ఊహకందని కథనంతో మేజిక్ చేసే జీతూ జోసెఫ్ ఈసారి చాలా తడబడ్డారు. ముందు కథేంటో చూద్దాం. ఆర్థిక లావాదేవీలు నడిపే ఒక పెద్ద కంపెనీ ఉద్యోగి కిరణ్ హఠాత్తుగా ఒక ట్రైన్ ప్రమాదంలో చనిపోతాడు. వేలకోట్ల విలువైన స్కాముల డేటా ఉన్న ఒక హార్డ్ డిస్క్ అతని దగ్గరే ఉండిపోతుంది. దాని కోసం కిరణ్ ని ప్రేమించి ఎంగేజ్ మెంట్ చేసుకున్న అభిరామి వెనుక పోలీసులు, గూండాలు పడతారు. సహాయం కోసం అశ్విన్ అనే యూట్యూబర్ వస్తాడు. ఆ తర్వాత జరిగే పరిణామాలు అసలు హంతకుడిని పట్టివ్వడమే స్టోరీ.

చాలా రొటీన్ అనిపించే ప్లాట్ తీసుకున్న జీతూ జోసెఫ్ ఈసారి బిగుతైన స్క్రీన్ ప్లే రాసుకోలేదు. దీంతో చాలా ట్విస్టులు ముందే ఊహించవచ్చు. కిరణ్ చనిపోయి ఉండడని చిన్నపిల్లాడు సైతం చెప్పేలా ఉండటం రైటింగ్ లోపమే. రెండు గంటల్లో చెప్పాల్సిన కంటెంట్ ని అదనంగా ఇంకో అరగంట పొడిగించడంతో చాలా ఎక్కువ ల్యాగ్ అనిపిస్తుంది. చివరి నలభై నిమిషాల్లో వచ్చే కొన్ని మలుపులు ఫోర్స్డ్ గా అనిపిస్తాయి. కొన్ని మాత్రమే పేలాయి. గత ఏడాది నూనకుజ్జితో డీసెంట్ సక్సెస్ అందుకున్న జీతూ జోసెఫ్ కి మిరేజ్ మాత్రం ఫ్లాప్ గా నిలవనుంది. దృశ్యం 3ని ఏం చేస్తారో మరి.