ఓజీ క్రేజ్‌ను క్యాష్ చేసుకుందామని…

ఓజీ.. గత కొన్నేళ్లలో ఇంత హైప్ తెచ్చుకున్న తెలుగు సినిమా మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. రిలీజ్‌కు నాలుగు రోజుల ముందు వరకు కూడా టీజర్, ట్రైలర్ ఏదీ రిలీజ్ కాకపోయినా.. పెద్దగా ప్రమోషన్లు చేయకపోయినా.. దీని హైప్ మామూలుగా లేదు. సెలబ్రెటీలు సైతం సామాన్య అభిమానుల తరహాలో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఓజీ హైప్‌తో హెల్త్ దెబ్బ తినేలా ఉందంటూ సిద్ధు జొన్నలగడ్డ లాంటి క్రేజీ యూత్ హీరో కూడా పోస్టు పెట్టాడంటే ఈ సినిమా కోసం జనం ఎలా ఊగిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు.

ఓజీ క్రేజ్‌ను క్యాష్ చేసుకుని తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి కూడా వేరే చిత్రాల వాళ్లు ప్రయత్నం చేస్తున్నారు. గత కొన్ని వారాలుగా ఏ సినిమా ఈవెంట్ జరిగినా.. ‘ఓజీ’ ప్రస్తావన లేకుండా అవి ముగియట్లేదు. ఈవెంట్లలో ఓజీ నినాదాలు వినిపించడమో.. నటీనటులు, టెక్నీషియన్లు ఓజీ ప్రస్తావన తేవడమో.. ఇంటర్వ్యూల్లో కూడా ఓజీ గురించి మాట్లాడ్డమో జరుగుతోంది.

ఇదిలా ఉంటే.. ‘ఓజీ’ సినిమాతో పాటుగా తమ టీజర్లు, ట్రైలర్లను ఎటాచ్ చేయాలని చాలా సినిమాల మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. దాదాపుగా 20 సినిమాల మేకర్స్ ‘ఓజీ’ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్‌ను సంప్రదించారట. ఇంటర్వెల్‌లో తమ కంటెంట్‌ను ప్లే చేస్తే భారీగా పేమెంట్ ఇవ్వడానికి ప్రపోజల్స్ పెట్టారట. వేరే భాషల చిత్రాల వాళ్లు కూడా డీవీవీ వాళ్లను ఇలా సంప్రదించినట్లు తెలుస్తోంది.

ఐతే డీవీవీ సంస్థ చాలా వరకు ఆఫర్స్‌ను తిరస్కరించింది. ‘ఓజీ’ క్రేజ్‌ను తన కొడుకు లాంచింగ్ కోసం ఉపయోగించుకోవాలని డీవీవీ దానయ్య నిర్ణయించుకున్నారు. దానయ్య కొడుకు దాసరి కళ్యాణ్‌ డెబ్యూ మూవీ ఎప్పుడో పట్టాలెక్కాల్సింది. కానీ రకరకాల కారణాలతో ఆలస్యం అయింది. అధీర పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ అందించాడు. అతడి పీవీసీయూలో భాగంగానే ఈ సినిమా తెరకెక్కనుంది. ‘ఓజీ’ ట్రైలర్‌తో ఈ సినిమా గ్లింప్స్‌ను ఎటాచ్ చేస్తున్నారు. ‘ఓజీ’ సినిమా ఇంటర్వెల్లో కూడా దాన్ని ప్రదర్శించబోతున్నారు. దీంతో పాటుగా ఒకట్రెండు టీజర్లను ఎటాచ్ చేసే అవకాశముంది.