ఓజి… ఇంత అయోమయం ఎందుకుజీ

పవన్ కళ్యాణ్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న ఓజి తెలంగాణ జిఓ వచ్చేసింది. సెప్టెంబర్ 24 రాత్రి 9 గంటలకు 800 రూపాయల ప్రత్యేక రేట్ మీద షోలు వేసుకోవడానికి అనుమతులు వచ్చేయడంతో వాళ్ళ ఆనందం అంతా ఇంతా కాదు. అయితే తెల్లవారుఝామున 4 నుంచి 9 గంటల మధ్యలో ఎక్స్ ట్రా ఆటలు వేసుకోవడానికి ఎలాంటి వెసులుబాటు ఇవ్వకపోవడం అయోమయానికి దారి తీస్తోంది. అంటే గరిష్టంగా ఉన్న అయిదు షోలు మాత్రమే వేసుకోవాలన్న మాట. అదే జరిగితే చాలా థియేటర్లలో టికెట్ ముక్క దొరికించుకునే లోపు చుక్కలు కనిపించడం ఖాయం.

ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ జిఓ మళ్ళీ రివైజ్ చేస్తారని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఏపీ ఉత్తర్వుల్లో ముందు రోజు రాత్రి ప్రీమియర్ లేదు. అర్ధరాత్రి ఒంటి గంటకు మాత్రమే ఎస్ అన్నారు. ఇప్పుడు తెలంగాణలో ముందు షోలు వేసి ఆలస్యంగా ఆంధ్రాలో వేస్తే లేనిపోని ఇబ్బంది తలెత్తుతుంది. ముఖ్యంగా రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండే వీరాభిమానులు ఊరు దాటి మరీ తమ ఫ్యానిజం చూపిస్తారు. ఇన్ సైడ్ టాక్ అయితే సవరణలతో కూడిన కొత్త జిఓ రావొచ్చని ఉంది. ఇక స్పెషల్ షో తెలంగాణ 800, ఏపీ 1000 రూపాయలు పెట్టడం భారీ వ్యత్యాసాన్ని చూపిస్తోంది. ఇది కూడా మార్పు చేయాల్సి రావొచ్చు.

రిలీజ్ డేట్ దగ్గర్లో పెట్టుకుని ఇలాంటి చివరి నిమిషపు ఒత్తిళ్లు పెద్ద సినిమాలకు ఈ మధ్య కామన్ అయిపోయింది. ఓజి ఇంకా నయం. వారం ముందుగానే ఈ వ్యవహారాలు మొదలయ్యాయి. గుంటూరు లాంటి చోట్ల ఆల్రెడీ వెయ్యి రూపాయలకు ప్రీమియర్ టికెట్లు అమ్మేశారు కూడా. మరికొన్ని చోట్ల ఆఫ్ లైన్ లో సోల్డ్ అవుట్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ముందు రోజు పెర్మిషన్ వస్తే మళ్ళీ వాళ్ళందరూ ఈ టికెట్లు కూడా కొనడమో లేదా ఒంటి గంట ఆటలు క్యాన్సిల్ చేసి దాని స్థానంలో ప్రీమియర్లు వేయడమో చేయాలి. చూస్తుంటే ఇంకో ఒకటి రెండు రోజులు ఈ గందరగోళ పర్వం కొనసాగేలా ఉంది.