నిర్మాత సాహు గారపాటికి ఇండస్ట్రీలో మంచి గుడ్ విల్ ఉంది కానీ సక్సెస్ పరంగా ఆయన బ్యానర్ లో వచ్చిన పెద్ద హిట్లు ఇప్పటిదాకా రెండే. ఒకటి మజిలీ, రెండు భగవంత్ కేసరి. 2018 కృష్ణార్జున యుద్ధంతో ప్రొడ్యూసర్ గా డెబ్యూ చేసిన ఈయనకు టక్ జగదీశ్, గాలి సంపత్, ఉగ్రం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. లైలా మరీ దారుణంగా దెబ్బ కొట్టింది. డిజాస్టర్లు అందరికీ సహజమే కానీ మరీ ఇంత నాసిరకం సినిమా తీస్తారా అంటూ షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద చిన్న మరక పడేలా చేసింది. మలయాళంలో తీసిన వ్యసనసమేతం బంధుమిత్రాదికల్ కు ప్రశంసలు వచ్చాయి కానీ ఆశించిన స్థాయిలో వసూళ్లు దక్కలేదు.
తాజాగా విడుదలైన కిష్కిందపురి కొంత ఊరట కలిగించిందనే చెప్పాలి. ఒకపక్క మిరాయ్ లాంటి ప్యాన్ ఇండియా మూవీతో పోటీ. ఇంకో వైపు దూకుడు తగ్గించకుండా లిటిల్ హార్ట్స్ ప్రమోషన్లతో దూసుకుపోతున్న వైనం, హారర్ జానర్ కాబట్టి అన్ని వర్గాలను తన సినిమా రీచ్ కాదేమోననే అనుమానం, వెరసి సాహు గారపాటిని ఒక రకమైన టెన్షన్ ఆవహించిందనేది పలు సందర్భాల్లో కనిపించింది. తమకు మాట వరసకైనా చెప్పకుండా మిరాయ్ డేట్ వేశారని హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తో పాటు సాహు కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం ఇంటర్వ్యూలో చూశాం. ఇన్ని ప్రతికూలతలు తట్టుకుని సినిమా అయితే నిలబడింది.
రికార్డులు బద్దలు కొట్టే బ్లాక్ బస్టర్ కాదు కానీ ఇంత కాంపిటీషన్ లోనూ బ్రేక్ ఈవెన్ దాటి లాభాలు ఇవ్వడం కిష్కిందపురికి జరిగిన మంచి విషయం. నెక్స్ట్ సాహు గారపాటి నుంచి వస్తున్న సినిమా మన శంకరవరప్రసాద్ గారు. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఎంటర్ టైనర్ ఇప్పటిదాకా ఈ బ్యానర్ లోనే పెద్ద బడ్జెట్ తో రూపొందుతోంది. వందల కోట్లు పెట్టడం లేదు కానీ క్యాస్టింగ్, కాంబినేషన్, సెట్టింగ్ పరంగా చూసుకుంటే వ్యయం చిన్నదేమీ కాదు.అనిల్ రావిపూడితో రెండోసారి జట్టు కట్టిన సాహు గారపాటికి ఇది కనక పెద్ద హిట్ అయితే అయితే టాప్ లీగ్ లోకి వెళ్లిపోవచ్చనే నమ్మకంతో ఉన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates