రజని కమల్ మల్టీస్టారర్… సడన్ ట్విస్ట్

ఒక్క కూలీ ఫలితం చాలా సమీకరణాలను మార్చేసేలా ఉంది. 46 సంవత్సరాల తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటించబోయే సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తారనేది ఇప్పటిదాకా ఉన్న టాక్. కానీ దానికి భిన్నంగా రజని స్పందించడం కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఒక ప్రెస్ మీట్ కు వెళ్లే సందర్భంలో ఈ ప్రాజెక్టు గురించిన ప్రశ్న జర్నలిస్టుల నుంచి రజనికి ఎదురయ్యింది. దానికాయన సమాధానమిస్తూ కమల్ తో తెరను పంచుకోవడం కోసం తాను ఎదురు చూస్తున్నానని, కథ దర్శకుడు కుదరగానే అన్ని వివరాలు మీకే తెలుస్తాయని నర్మగర్భంగా అనేసి వెళ్లిపోయారు.

అంటే ష్యుర్ షాట్ గా లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తాడనేది చెప్పలేదు. ఒకవేళ ఖరారు అయితే కూలిని బాగా తీశాడు, లోకేష్ తోనే వెళ్తున్నామని కనీసం ఒక మాటైనా చెప్పేవారుగా. రాజ్ కమల్ ఇంటర్నేషనల్, రెడ్ జాయింట్ ఫిలిమ్స్ కు కమిట్ మెంట్స్ ఇచ్చానని చెప్పిన రజని వాటిలో మొదటి బ్యానర్ స్వయానా తన స్నేహితుడు కమల్ స్వంతంది కావడంతో మల్టీస్టారర్ చేసే విషయంలో ఎలాంటి డౌట్స్ లేనట్టే. అయితే ఇంత పెద్ద బాధ్యతను లోకేష్ కాకుండా ఇంకెవరు హ్యాండిల్ చేయగలరనే దాని మీద ఫ్యాన్స్ మధ్య రకరకాల డిస్కషన్లు జరుగుతున్నాయి. అప్పుడే ఆప్షన్లు కూడా చెబుతున్నారు.

ఎవరి చేతికి వెళ్లినా ఈ మూవీ మాత్రం పెద్ద ఛాలెంజ్ గా నిలుస్తుంది. కూలి ఫ్లాప్ కావడం పక్కనపెడితే అందులో ప్రధాన లోపం కథలోనే ఉంది. ఒకవేళ సరైన స్టోరీ రాసుకుని ఉంటే ఖచ్చితంగా లోకేష్ మెప్పించేవాడు. సో కమల్, రజని ఇద్దరినీ హ్యాండిల్ చేసే సత్తా ఇతనికే ఉందని ఫ్యాన్స్ అభిప్రాయం. మణిరత్నం, శంకర్ లాంటి లెజెండ్స్ ఫామ్ తప్పిపోయారు. సో ఎలా చూసుకున్నా కొత్త తరం డైరెక్టర్లకే ఛాన్స్ ఇవ్వాలి. ఒకవేళ లోకేష్ కాకపోతే మటుకు వినోత్, కార్తిక్ సుబ్బరాజ్, ఆదిక్ రవిచందర్ లాంటి వాళ్లలో ఎవరు ఈ గోల్డెన్ ఛాన్స్ కొడతారో చూడాలి. అప్పటిదాకా రకరకాల ప్రచారాలు తిరుగుతూనే ఉంటాయి.