హనుమాన్ బ్లాక్ బస్టర్ తర్వాత ఏడాదిన్నర పైగా గ్యాప్ తీసుకున్న తేజ సజ్జకు ఆ నిరీక్షణకు తగ్గ ఫలితమే దొరికింది. మిరాయ్ రూపంలో మరో ఘనవిజయం సొంతం చేసుకోవడంతో పాటు హిందీ మార్కెట్ మరింత బలపడే దిశగా కరణ్ జోహార్ చేసిన డిస్ట్రిబ్యూషన్ మంచి ఫలితాలు ఇస్తోంది. బాలీవుడ్ లో ఓపెనింగ్స్ రావడానికి కీలకంగా వ్యవహరించే వన్ ప్లస్ వన్ లాంటి పద్దతులను మిరాయ్ కి ఆపాదించడం ద్వారా వీకెండ్ వసూళ్లను పెంచడంలో కరణ్ పోషించిన పాత్ర చాలా ఉంది. సైయారాకు యష్ రాజ్ ఫిలిమ్స్ ఇదే స్ట్రాటజీతో సక్సెస్ అందుకోగా ఇప్పుడు మిరాయ్ కూడా అదే దారిలో వెళ్లేందుకు రూటు వేసుకుంది.
ఇప్పుడు తేజ సజ్జ నెక్స్ట్ జాంబీ రెడ్డి 2కి రెడీ అవుతున్నాడు. దీన్ని కూడా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. అయితే ఇప్పటిదాకా దర్శకుడు ఎవరో వెల్లడించలేదు.లీక్స్ అయితే రానా నాయుడు ఫేమ్ సుపర్న వర్మ అంటున్నాయి కానీ కన్ఫర్మ్ గా ఏదీ తెలియలేదు. ఎప్పుడు స్టార్ట్ అయినా 2027 సంక్రాంతి రిలీజ్ అన్నారు కాబట్టి ఇంకా చాలా టైం ఉంది. విజువల్ ఎఫెక్ట్స్, క్వాలిటీ దృష్ట్యా ఖచ్చితంగా అంత టైం లోపల పూర్తవుతుందా అంటే గ్యారెంటీగా చెప్పలేం. మిరాయ్ సైతం రెండు మూడు వాయిదాల తర్వాత సెప్టెంబర్ తీసుకుంది. మరి జాంబీ రెడ్డి 2కి ఎంత సమయం పడుతుందో ఇప్పటికిప్పుడు చెప్పలేం.
మార్కెట్, ఇమేజ్ పెంచుకోవడానికి తేజ సజ్జ తీసుకుంటున్న జాగ్రత్తలు మంచివే కానీ ఇలా రెండేళ్లకో సినిమా అంటే కెరీర్ పరంగా నెమ్మదితనం పెరిగిపోయే ప్రమాదముంది. ఎలాగూ టయర్ 1 స్టార్లు ఇంతకన్నా త్వరగా సినిమాలు చేయలేకపోతున్నారు. అలాంటిది ఎంతో భవిష్యత్తు ఉండి ఇప్పుడిప్పుడే ఫాలోయింగ్ పెంచుకుంటున్న తేజ సజ్జలాంటి వాళ్ళు కూడా స్లో అండ్ స్టడీ అంటే కష్టం. ఎలా కనిపిస్తాడనేది పక్కన పెడితే తేజ మూడు పదుల వయసులో ఉన్నాడు. కేవలం ఫాంటసీ జానర్ కే కట్టుబడకుండా రకరకాల ప్రయోగాలు చేయాలి. ఒక నటుడికి కంటెంట్ తో పాటు కౌంట్ కూడా ముఖ్యమే. చూడాలి ఏం చేస్తాడో.
Gulte Telugu Telugu Political and Movie News Updates