బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఇప్పుడప్పుడే లాల్ సింగ్ చద్దా గాయాలను మర్చిపోయేలా లేడు. సితారే జమీన్ పర్ తో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుని ఓటిటిలో కాకుండా యూట్యూబ్ లో స్ట్రీమింగ్ చేయడం ద్వారా కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన ఈ వర్సటైల్ హీరో తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. అక్కినేని నాగచైతన్యకు హిందీ డెబ్యూగా దీని మీద తెలుగులోనూ మంచి అంచనాలు ఉండేవి. చిరంజీవి లాంటి ప్రముఖులకు ప్రీమియర్ వేసి మరీ పబ్లిసిటీ చేసుకున్నారు. ఇంతా చేసి కనీస వసూళ్లు రాకపోగా అమీర్ ఖాన్ నటన కూడా విమర్శలు చవి చూడాల్సి వచ్చింది.
అమీర్ చెప్పిన ప్రకారం జరిగిన కథ ఇది. దంగల్ కు ఇండియాలోనే 385 కోట్లు వచ్చాయి. అంత మొత్తం కాకపోయినా లాల్ సింగ్ చద్దా కనీసం వంద నుంచి రెండు వందల కోట్ల దాకా చేయొచ్చని అమీర్ అంచనా వేశారు. కానీ ఫుల్ రన్ పూర్తయ్యేలోగా 200 కోట్ల నష్టం మిగలడం అమీర్ ని షాక్ కి గురి చేసింది. షూటింగ్ మధ్యలో కరోనా వచ్చింది. దీంతో కీలక షెడ్యూల్స్ కోసం విదేశాలకు వెళ్లారు. యూనిట్ సభ్యుల ప్రయాణాలకే ఎక్కువ ఖర్చయ్యింది. టేబుల్ టెన్నిస్ మీద తీసిన ఒక ఖరీదయిన ఎపిసోడ్ కు కోట్లు కుమ్మరించారు. అదేమో ఎడిటింగ్ టేబుల్ దగ్గర తీసేయాల్సి వచ్చింది. ఇదంతా బూడిదలో పోసిన పన్నీరే.
ఇలా ప్రొడక్షన్ లోనే దెబ్బ మీద దెబ్బ తిన్న అమీర్ ఖాన్ తీరా థియేటర్ రిలీజ్ అయ్యాక మొదటి షోకే చేతులు ఎత్తేయడం ఫ్యాన్స్ సైతం ఊహించలేదు. ఓవర్సీస్ లోనూ డిజాస్టర్ కావడం మరో చేదు జ్ఞాపకం. లాల్ సింగ్ చద్దా ఆడితే జపాన్, చైనా తదితర దేశాల్లో రిలీజ్ చేయడం ద్వారా మొత్తం రికవర్ చేయొచ్చని అమీర్ భావించారు. కానీ జరిగింది వేరు. ఇంకా నయం, సితారే జమీన్ పర్ హిట్టయ్యింది కాబట్టి సరిపోయింది లేదంటే అమీర్ పరిస్థితి ఇంకా దీనంగా మారిపోయేదేమో. ఒకపక్క కొడుకు సెటిల్ కావడం లేదు. చేసిన సినిమాలన్నీ ఓటిటిలో కూడా దారుణంగా డిజాస్టరయ్యాయి. ఎప్పటికి బ్రేక్ దొరికేనో.
Gulte Telugu Telugu Political and Movie News Updates