55 కోట్లు… వసూళ్లు కాదు పాఠాలు

మిరాయ్ దూకుడు మాములుగా లేదు. వీకెండ్ ని యునానిమస్ గా డామినేట్ చేస్తోంది. ఏపీ తెలంగాణలో ఎక్స్ ట్రా షోలు, థియేటర్లతో టికెట్ల డిమాండ్ ని తట్టుకోవడానికి ఎగ్జిబిటర్లు చేస్తున్న ప్లానింగ్ తో ఆదివారం చాలా బిజీగా ఉంది. నిర్మాణ సంస్థ అధికారికంగా రెండు రోజుల వసూళ్లను 55 కోట్ల 60 లక్షలుగా ప్రకటించింది. హనుమాన్ ని దాటేయడానికి పరుగులు పెడుతున్న తేజ సజ్జ సోలో హీరోగా మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. మల్టీప్లెక్సులు, ప్రీమియం సింగల్ స్క్రీన్లలో మిరాయ్ టికెట్ ముక్క దొరికితే ఒట్టు అనేలా పరిస్థితి మారిపోయింది. వీకెండ్ సెకండ్ షోల దాకా అన్ని చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

వీటిని కేవలం వసూళ్లగానే కాకుండా పాఠాలుగా చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా టికెట్ రేట్లు పెంచుకుంటే తప్ప గట్టెక్కలేమనే భ్రమలో ఉన్న టయర్ 2 నిర్మాతలకు ఇదో చెంపపెట్టు లెసన్ గా నిలుస్తోంది. అవకాశం పలుకుబడి ఉన్నా సరే టికెట్ హైక్స్ తీసుకోకుండా రెగ్యులర్ ధరలకే కట్టుబడి ఉండటం ఫ్యామిలీ ఆడియన్స్ ని అధిక శాతం వచ్చేలా చేస్తోంది. నిజంగానే మిరాయ్ కు పెంపు అడిగి ఉంటే వెంటనే వచ్చేసేది. ఇప్పుడున్న టాక్ కి జనాలు చూసేవాళ్ళు. కానీ వీకెండ్ కాగానే వెంటనే డ్రాప్ తీవ్రంగా ఉండే ప్రమాదం పొంచి ఉండేది. దాన్ని మిరాయ్ దిగ్విజయంగా తప్పించుకోవడం రేపటి నుంచి చూడొచ్చు.

కంటెంట్ మీద నమ్మకం ఉన్నప్పుడు, అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చినప్పుడు ఎలాంటి పెంపులు, సవరణలు అక్కర్లేదని మిరాయ్ నిరూపించేసింది. మిగిలిన నిర్మాతలు దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. విజువల్ ఎఫెక్ట్స్ లేని చిన్న బడ్జెట్ సినిమాలు లిటిల్ హార్ట్స్ రూపంలో అద్భుతాలు చేసి చూపించాయి. విఎఫ్ఎక్స్ మీద ఆధారపడిన మిరాయ్ లాంటివి మాములు టికెట్ రేట్లతో ఈ ఏడాది టాప్ గ్రాసర్స్ ని టార్గెట్ చేసుకున్నాయి. అలాంటప్పుడు ఇకపై ఈ విషయంలో ప్రొడ్యూసర్లు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. జిఓలు వచ్చినంత సులభంగా కలెక్షన్లు రావని గుర్తు పెట్టుకుంటే చాలు.