టికెట్ రేట్లు చేసిన మేలు అర్థమయ్యిందిగా

మిరాయ్ మొదటి రోజు మంచి ఓపెనింగ్ తెచ్చుకుంది. వరల్డ్ వైడ్ 27 కోట్లకు పైగా గ్రాస్ రావడం మాములు విషయం కాదు. ఈ మధ్య కాలంలో కొందరు హీరోలు ఈ ఫిగర్ ని అందుకోవడానికి కిందా మీద పడుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన పాయింట్ ఒకటుంది. మిరాయ్ ఏపీ, తెలంగాణలో ఎలాంటి టికెట్ ధరల పెంపుకు వెళ్లకుండా తీసుకున్న నిర్ణయం ప్రేక్షకుల కోణంలో గొప్ప ఊరటనిచ్చింది. తెలంగాణలో గరిష్టంగా అనుమతి ఉన్న 295 రూపాయలను మల్టీప్లెక్స్ రేటుగా ఫిక్స్ చేయగా, ఆంధ్రప్రదేశ్ లో 177 రూపాయలకు ఒక్క పైసా అదనంగా పెట్టకపోవడం భారీ ఫుట్ ఫాల్స్ ని తీసుకొస్తోంది.

ఒకవేళ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తరఫున నిర్మాత విశ్వప్రసాద్ కనక హైక్స్ అడిగి ఉంటే ఏపీ సర్కారు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేది. కానీ అధిక శాతం ప్రేక్షకులు ముఖ్యంగా చిన్న పిల్లలు చూడాలన్న లక్ష్యంతో ఆయన దాని జోలికి వెళ్ళలేదు. అదే ఇప్పుడు గొప్ప మేలు చేస్తోంది. బిసి సెంటర్స్ లో మిరాయ్ కలెక్షన్లు ఉదృతంగా ఉండటానికి ఇది దోహదం చేస్తున్న మాట వాస్తవం. ఒక్కో టికెట్ మీద యాభై నుంచి వంద దాకా పెంపు తప్పించుకోవడం అంటే సగటు మధ్య తరగతి ప్రేక్షకుడికి చాలా పొదుపు జరిగినట్టు. కుటుంబం మొత్తం మీద మూడు నాలుగు వందలు మిగలడం అంటే మాటలు కాదు.

గత రెండు మూడు నెలల్లో కేవలం ఈ పెంపుల వల్లే రెవిన్యూ తగ్గించుకున్న సినిమాలున్నాయి. కుబేర మంచి టాక్ ని పూర్తి స్థాయిలో క్యాష్ చేసుకోలేదు. హిట్ 3 ది థర్డ్ కేస్ రెండో వారం వచ్చేలోపే ఇబ్బందులు పడింది. హరిహర వీరమల్లుకి ఈ దెబ్బ ఇంకాస్త గట్టిగా తగిలింది. హిట్టు ఫ్లాపు పక్కనపెడితే కనీసం వారం రోజులు మంచి ఆక్యుపెన్సీలు నమోదు చేసే కెపాసిటీ ఉన్న స్టార్లు సైతం ఈ టికెట్ రేట్ల పంచాయితీ వల్ల డెఫిషిట్లు చూడాల్సి వస్తోంది. ఈ కోణంలో చూస్తే మిరాయ్ ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా మీడియం బడ్జెట్ సినిమాలు దీన్ని ఫాలో కావడం అవసరం.