సేఫ్ గేమ్ వదిలేస్తున్న సాయిశ్రీనివాస్

హీరోలు కెరీర్ పరంగా మార్కెట్ పెంచుకోవాలన్నా, ఇమేజ్ మారాలన్నా రిస్కులు చేయాలి. రకరకాల జానర్లు టచ్ చేయాలి. అప్పుడే నటనతో పాటు అన్నివిధాలా మెరుగు పడే అవకాశం ఉంటుంది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ వరస చూస్తుంటే అదే అనిపిస్తోంది. క్రమంగా తను రొటీన్ కు దూరంగా వెళ్తున్నాడు. గ్యాప్ రావడానికి ముందు వచ్చిన చివరి తెలుగు సినిమా అల్లుడు అదుర్స్ పెద్ద పాఠమే నేర్పించినట్టు ఉంది. అందుకే తమిళంలో కమెడియన్ సూరి హీరోగా చేసిన పాత్రను ఇక్కడ రీమేక్ లో చేయడానికి సిద్ధపడ్డాడు. భైరవం కమర్షియల్ గా పెద్దగా ఆడలేదు కానీ పెర్ఫార్మన్స్ పరంగా దక్కిన మార్కులు ఎక్కువే.

తాజాగా కిష్కిందపురితో మరో రిస్క్ చేశాడు. మాములుగా హారర్ జానర్ ని స్టార్ హీరోలు ట్రై చేయరు. చంద్రముఖితో రజనీకాంత్ దాన్ని బ్రేక్ చేసినప్పటికీ మిగిలినవాళ్లు కొనసాగించలేదు. వెంకటేష్ నాగవల్లితో, నాగార్జున రాజుగారి గది 2తో లెక్క తప్పారు కానీ సరిగా వాడుకుంటే దెయ్యాల కథలు కాసులు కురిపిస్తాయి. లారెన్స్ ఇంత పెద్ద స్థాయికి రావడానికి కారణం ముని సిరీసే. అందుకే సాయిశ్రీనివాస్ ఇమేజ్ లెక్కలు, మార్కెట్ వగైరాలు చూసుకోకుండా దెయ్యాల స్టోరీకి ఎస్ చెప్పాడు. సెకండాఫ్ లో విలన్ కే ఎక్కువ ఎడ్జ్ ఉన్నా దర్శకుడు కౌశిక్ మీద నమ్మకంతో అడిగిందల్లా చేసుకుంటూ వెళ్ళాడు.

కిష్కిందపురి కమర్షియల్ రేంజ్ ఏంటనేది తేలడానికి ఇంకా టైం పడుతుంది కానీ సాయిశ్రీనివాస్ నెక్స్ట్ లైనప్ కూడా డిఫరెంట్ గానే కనిపిస్తోంది. టైసన్ నాయిడు సుదీర్ఘ కాలంగా నిర్మాణంలో ఉన్నప్పటికీ విభిన్నమైన పాయింట్ తో తెరకెక్కిందని ఇన్ సైడ్ టాక్. హైందవ ఇప్పటిదాకా వచ్చిన సినిమాల్లో కెరీర్ బెస్ట్ గా నిలుస్తుందని రషెస్ చూసినవాళ్లు చెబుతున్న మాట. రొట్ట ఫార్ములాలకు దూరంగా వెళ్తున్న సాయిశ్రీనివాస్ కి ఇప్పటికిప్పుడు ఇన్స్ టాంట్ రిజల్ట్స్ రావొచ్చు రాకపోవచ్చు. అయితే తను ఎంచుకున్న దారి మాత్రం మంచి ఫలితాలే ఇస్తుంది. సేఫ్ గేమ్ నుంచి పక్కకు రావడం ఏ కోణంలో చూసినా మంచిదే.