‘మిరాయ్’ పాన్ ఇండియా పథకం పారిందా?

మిరాయ్.. కొంత కాలంగా ఇటు తెలుగు సినిమా పరిశ్రమ జనాలు, అటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా. గత దశాబ్ద కాలంలో ‘బాహుబలి’, ‘పుష్ప’,  ‘కార్తికేయ-2’, ‘ఆర్ఆర్ఆర్’, ‘హనుమాన్’, ‘కల్కి’ లాంటి చిత్రాలతో జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పేరు మార్మోగింది. ఐతే వీటి స్ఫూర్తితో మరెన్నో ‘పాన్ ఇండియా’ లేబుల్ వేసుకున్న సినిమాలు వచ్చాయి. కానీ వాటికి చేదు అనుభవం ఎదురైంది. పాన్ ఇండియా మోజులో పడి మన ఫిలిం మేకర్స్ నేల విడిచి సాము చేస్తున్నారనే విమర్శలూ తప్పలేదు. ఇలాంటి టైంలో ‘మిరాయ్’ మళ్లీ ఆ మ్యాజిక్ చేస్తుందా అని అంతా ఎదురు చూశారు.

ఐతే టీజర్, ట్రైలర్‌లతో రేపిన అంచనాలను ‘మిరాయ్’ అందుకుంది. పరిమిత బడ్జెట్లో విజువల్ ఎఫెక్ట్స్‌ను సమర్థంగా వాడుకుని ప్రేక్షకులకు అద్భుతమైన బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడంలో ఈ సినిమా విజయవంతం అయింది. ‘మిరాయ్’ సినిమాకు నార్త్ ఇండియన్ క్రిటిక్స్ నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. మంచి రేటింగ్‌లతో సినిమాను మెచ్చుకున్నారు. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ అంత గొప్పగా ఏమీ లేవు. కానీ హిందీ ప్రేక్షకులు సినిమా చూడడానికి ఆత్రపడరు. సినిమా బాగుందంటే నెమ్మదిగా థియేటర్లకు వస్తారు.

పేరున్న నటీనటులు లేకపోయినా సరే.. డివైన్ ఎలిమెంట్స్‌ను బాగా చూపిస్తే వాళ్లు ఎగబడి సినిమాలు చూస్తారని కార్తికేయ-2, కాంతార, హనుమాన్ లాంటి చిత్రాలు రుజువు చేశాయి. హనుమాన్‌తో పాపులరైన తేజ సజ్జనే హీరో కావడం ‘మిరాయ్’కి ప్లస్. సినిమాకు అన్ని వైపులా పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. డివైన్ ఎలిమెంట్స్‌ను ప్రెజెంట్ చేసిన తీరు ఆకట్టుకుంది. వీఎఫెక్స్ విషయంలోనూ ప్రశంసలు కురుస్తున్నాయి. భారీ పక్షితో ముడిపడ్డ ఎపిసోడ్ లు అదిరిపోయాయి.. యాక్షన్ ఘట్టాలు కూడా ఆకట్టుకుంటున్నాయి. దీంతో సినిమా కచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలో బాగానే ప్రభావం చూపిస్తుందని ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు.