బాల నటుడిగా ప్రయాణం మొదలుపెట్టి.. ఇప్పుడు హీరోగా మంచి స్థాయికి చేరుకున్న నటుడు తేజ సజ్జా. పెద్దవాడు అయ్యాక చేసిన తొలి చిత్రం ‘ఓ బేబీ’, హీరోగా నటించిన తొలి చిత్రం ‘జాంబి రెడ్డి’ మంచి ఫలితాలు అందించగా.. ‘హనుమాన్’ మూవీ అతణ్ని పాన్ ఇండియా స్థాయిలో స్టార్ను చేసింది. తేజ కొత్త చిత్రం ‘మిరాయ్’ మీద భారీ అంచనాలే ఉన్నాయి. అది తన కెరీర్ను మరో స్థాయికి తీసుకెళ్తుందని భావిస్తున్నారు.
ఈ సినిమాను పెద్ద బడ్జెట్లో నిర్మిస్తున్న పీపుల్స్ మీడియా సంస్థ.. అది విడుదల కాకముందే అతడితో మరో చిత్రాన్ని అనౌన్స్ చేయడం విశేషం. ఆ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ను తాజాగా లాంచ్ చేశారు. ఇదొక ఫాంటసీ టచ్ ఉన్న సైన్స్ ఫిక్షన్ అని సంకేతాలు ఇచ్చేలా ఉంది పోస్టర్. ‘‘రాయలసీమ నుంచి ప్రపంచం అంచుల వరకు’’ అని క్యాప్షన్ కూడా జోడించారు. ఈ వ్యవహారమంతా చూస్తే ఇది ‘జాంబిరెడ్డి’ సీక్వెల్ అనే విషయం కూడా అర్థమవుతోంది.
ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. ఈ పోస్టర్ మీద దర్శకుడి పేరు వేయలేదు. అనౌన్స్మెంట్ ప్రెస్ నోట్లో కూడా దర్శకుడి పేరు ప్రస్తావించలేదు. కానీ ఇది ‘జాంబి రెడ్డి’ సీక్వెలే అని.. ప్రశాంత్ వర్మనే డైరెక్ట్ చేయొచ్చని భావిస్తున్నారు. లేదంటే ప్రశాంత్ స్క్రిప్టుతో మరో దర్శకుడెవరైనా ఈ సినిమా తీసే అవకాశముంది. ‘జాంబిరెడ్డి’కి సీక్వెల్ ఉంటుందని ఆ సినిమా రిలీజైనపుడే ప్రశాంత్ ప్రకటించాడు.
తెలుగులో జాంబి జానర్లో తెరకెక్కిన సినిమాలు చాలా తక్కువ. వాటిలో మంచి ఫలితాన్ని అందుకున్నది ‘జాంబిరెడ్డి’ ఒక్కటే. ఇప్పుడు తేజ ఇమేజ్ మారిపోయిన నేపథ్యంలో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెెక్కించి పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసే అవకాశముంది. కంటెంట్ బలంగా ఉంటే ‘జాంబిరెడ్డి-2’ తేజకు మరో పెద్ద విజయాన్ని అందించే ఛాన్సుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates