టాలీవుడ్న గత మూడు వారాలుగా కార్మికుల సమ్మె కుదిపేసింది. జీతాల పెంపు కోసం ఫిలిం ఫెడరేషన్ ఇన్ని రోజుల పాటు స్ట్రైక్ చేయడం ఇండస్ట్రీకి పెద్ద షాక్. దీంతో షూటింగ్స్ అన్నీ ఆగిపోయి నిర్మాతలకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు తప్పలేదు. మధ్యలో చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లే కనిపించాయి. కానీ మళ్లీ ప్రతిష్టంభన తప్పలేదు. ఐతే ఎట్టకేలకు సమ్మె ఆగింది. చిత్రీకరణలు శుక్రవారం నుంచే పున:ప్రారంభం అవుతున్నాయి. మరి సమ్మె ఆగేలా చేయడానికి కుదిరిన రాజీ ఒప్పందం ఏంటి అన్నది ఆసక్తికరం.
ఇంతకుముందు నిర్మాతలు ప్రతిపాదించిన జీతాల పెంపుకి అంగీకరించని కార్మికులు.. స్వల్ప మార్పులతో ఇప్పుడు సరే అన్నారు. రాజీ ఒప్పందం ప్రకారం జీతాల పెంపు ఎలా ఉండబోతోందంటే.. తమకు 30 శాతం మేర జీతాలు పెంచాలని కార్మికులు డిమాండ్ చేయగా.. అలా కాకుండా 22.5 శాతం, అది కూడా దశల వారీగా జీతాలు పెంచేలా ఒప్పందం కుదిరింది.
రోజుకు రూ.2 వేల లోపు జీతాలు ఉన్న వారికి తొలి ఏడాది 15 శాతం, రెండో ఏడాది 2.5 శాతం, మూడో ఏడాది 5 శాతం పెంపు ఉండబోతోంది. రోజుకు రూ.2 వేల నుంచి రూ.5 వేల ఆదాయం ఉన్న వారికి తొలి ఏడాది 7.5 శాతం, రెండో ఏడాది 5 శాతం, మూడో ఏడాది 5 శాతం జీతాలు పెంచనున్నారు. సమ్మె ఆరంభమైన తొలి వారంలోనే నిర్మాతలు ఇలా దశల వారీగా జీతాల పెంచేందుకు ఒక ప్రతిపాదన చేశారు. కానీ అందుకు కార్మికులు అంగీకరించలేదు. అందరికీ ఏకమొత్తంగా వాళ్లు ప్రతిపాదించిన దాని కంటే ఎక్కువ జీతాలు కావాలని కోరారు. ఐతే తాజాగా మెగాస్టార్ చిరంజీవి జోక్యం చేసుకోవడం.. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ఒత్తిడి రావడంతో రాజీ ఒప్పందం కుదిరింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates