ఛత్రపతి రీమేక్.. సుజీత్ తేల్చేశాడు

‘రన్ రాజా రన్’ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్లోకి సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చాడు సుజీత్. ఆ చిన్న సినిమాలో అతడి టాలెంట్ చూసి ప్రభాస్ లాంటి పెద్ద స్టార్ అతడికి కమిట్మెంట్ ఇచ్చాడు. ‘బాహుబలి’ లాంటి మెగా బ్లాక్‌బస్టర్ తర్వాత ప్రభాస్ సుజీత్‌తోనే సినిమా చేశాడు. కానీ అంచనాలను అందుకోవడంలో సుజీత్ విఫలమయ్యాడు.

‘సాహో’ అతడి కెరీర్‌ను తల్లకిందులు చేసింది. ఈ సినిమా తర్వాత మెగాస్టార్‌తో ‘లూసిఫర్’ రీమేక్‌లో అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. ఈ మధ్య ఏమో ‘ఛత్రపతి’ సినిమాను బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా హిందీలో సుజీత్ రీమేక్ చేయబోతున్నాడని.. దానికి మిగతా కాస్టింగ్ కూడా ఖరారైపోయిందని.. ప్రి ప్రొడక్షన్ వర్క్ కూడా జరిగిపోతోందని మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. కానీ చివరికి చూస్తే అది ఫేక్ న్యూస్ అని తేలిపోయింది.

తాను ‘ఛత్రపతి’ బాలీవుడ్ రీమేక్‌ను డైరెక్ట్ చేయడం లేదని సుజీతే స్వయంగా స్పష్టత ఇచ్చాడు. ‘ఛత్రపతి’ ఊసు ఎత్తకుండా అతను ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటో పెట్టి ‘‘ఏ రీమేకూ చేయట్లేదు’’ అనే క్యాప్షన్ జోడించాడు సుజీత్. దీన్ని బట్టి ‘ఛత్రపతి’ అనే కాదు.. మరే రీమేక్‌ కోసమూ తాను పని చేయట్లేదని.. రీమేక్‌లు చేసే ఉద్దేశమే తనకు లేదని చెప్పకనే చెప్పినట్లయింది. ‘లూసిఫర్’ రీమేక్ నుంచి కూడా సుజీతే తప్పుకున్నట్లు చిరంజీవి వెల్లడించిన సంగతి తెలిసిందే.

అదే నిజమైతే.. ‘ఛత్రపతి’ రీమేక్ చేయడంలోనూ సుజీత్‌కు ఆసక్తి లేనట్లే. ప్రస్తుతం తన సొంత కథ మీదే సుజీత్ పని చేస్తున్నట్లుంది. ‘రన్ రాజా రన్’ తరహాలో మీడియం బడ్జెట్లో ఓ సినిమా చేసి తనేంటో రుజువు చేసుకుని ఆ తర్వాత స్టార్ల కోసం ప్రయత్నిద్దామని సుజీత్ భావిస్తుండొచ్చు. అతడి తొలి రెండు సినిమాలను నిర్మించిన యువి క్రియేషన్స్‌లోనే సుజీత్ తన తర్వాతి సినిమాను కూడా చేయొచ్చని అంటున్నారు.