ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో ఎక్కడ చూసినా వార్ 2 గురించిన చర్చే జరుగుతోంది. ఊహించని స్థాయిలో వసూళ్లు పడిపోవడంతో బయ్యర్లు ఆందోళన చెందుతున్నారు. వీకెండ్ వరకు బుక్ మై షోలో మంచి ట్రెండింగ్ లోనే ఉన్నప్పటికీ సోమవారం నుంచి ఆక్యుపెన్సీలు చాలా కిందకు పడిపోవడంతో బ్రేక్ ఈవెనయ్యే సూచనలు కనుమరుగవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఓపెనింగ్స్ అయితే తేగలిగాడు కానీ వీక్ కంటెంట్ తో అంతకన్నా పుష్ చేయలేకపోవడం కలెక్షన్లను తగ్గిస్తోంది. వార్ 2 తేబోయే నష్టాలు 2025లో ఏ సంస్థకు రానంత అత్యధికంగా ఉంటాయనేది ట్రేడ్ విశ్లేషకుల అంచనా. ఇదంతా ఒక వైపు నడిచిన కథ.
వార్ 2 ని ఇంత పెద్ద బడ్జెట్ తో నిర్మించిన యష్ రాజ్ ఫిలింస్ కి గత నెల విడుదలైన సైయారా బంగారు బాతులా మారి సంస్థని నిలబెట్టిందని చెప్పాలి. ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్ లో కొత్త వాళ్ళతో నిర్మించిన ఈ లవ్ మూవీ మీద తొలుత ఎవరికీ అంచనాలు లేవు. జనాలు వస్తారో రారో అనే సందేహంతో కాలేజీ స్టూడెంట్స్ కి మొదటి రోజే వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇచ్చారు. తర్వాత వసూళ్ల సునామి మొదలయ్యింది. ఏకంగా 500 కోట్లకు దాటేసి ట్రేడ్ ని నివ్వెరపరిచింది. ఇంతా చేసి సైయారాకి యష్ రాజ్ ఫిలింస్ సోలో ప్రొడ్యూసర్ కాదు. అక్షయ్ విధ్వాని అనే నిర్మాత వీళ్ళ దగ్గరికి వస్తే కొలాబరేటయ్యి పెట్టుబడితో పాటు రిలీజ్ సాఫీగా జరిగేలా చూసుకుంది.
కట్ చేస్తే ఇప్పుడీ సైయారానే కాసులు కురిపించే కామధేనువుగా మారింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటికీ చాలా చోట్ల సైయారాకు హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. వార్ 2కి ధీటుగా ఎగ్జిబిటర్లు షోలు వేస్తున్నారు. 2019 నుంచి చూసుకుంటే యష్ రాజ్ ఫిలింస్ కి లాభాలు తెచ్చిన పెద్ద సినిమాలు రెండే. వార్, పఠాన్. మిగిలినవన్నీ బోల్తా కొట్టాయి. బంటీ ఔర్ బబ్లీ 2, సామ్రాట్ పృథ్విరాజ్, టైగర్ 3 దారుణంగా పోయాయి. శంషేరాని డైరెక్ట్ ఓటిటికి ఇచ్చారు. ఈ ఏడు సంవత్సరాల కాలంలో పెట్టిన పెట్టుబడి మీద రూపాయికి పది రూపాయల లాభం తెచ్చిన సినిమా సైయారా ఒక్కటే. అందుకే కంటెంట్ ఈజ్ కింగ్ అని ఊరికే అనలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates