అల్లు అరవింద్ మాటల్లో నిగూఢార్థం

సైమా అవార్డుల ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. టాలీవుడ్ కు ఏడు జాతీయ అవార్డులు వచ్చినా ఇండస్ట్రీ సత్కరించుకోలేదని, కానీ సైమా ఆ చొరవ తీసుకుని మంచి పని చేసిందని మెచ్చుకుంటూ చేసిన కామెంట్స్ చర్చకు దారి తీస్తున్నాయి. ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వాళ్లదే కాబట్టి ఎవరిని ఏం అనలేం అనే తరహాలో అన్న మాటలు ఒకరిని ఉద్దేశించినవి కాకపోయినా అందులో నిగూడార్థం అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఊరికే వివాదం కోసం యథాలాపంగా ఏదో అనేయడం కాదు. ప్రాక్టికల్ గానే ఉన్నారని విశ్లేషించుకుంటే అర్థమవుతుంది.

నిజంగానే నేషనల్ అవార్డు విజేతలను తెలుగు పరిశ్రమ సెలెబ్రేట్ చేసుకోలేదు. ఇప్పటిదాకా ఎందరో అగ్రహీరోలకు కలగా మిగిలిన ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ నిలిచాడు. మొత్తం ఏడు విభాగాల్లో మన సత్తా బయట పడింది. కానీ సన్మానం చేసే దిశగా ఎవరూ ఆలోచించలేదు. ఫిలిం ఛాంబర్, మా అసోసియేషన్, దర్శకుల సంఘం, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎవరూ చొరవ తీసుకోలేదు. కొందరు ట్విట్టర్ లో కంగ్రాట్స్ చెప్పి చేతులు దులుపుకున్నారు తప్పించి అంతకు మించి ఏం లేదు. సంధ్య థియేటర్ దుర్ఘటనలో బన్నీకి బెయిల్ వచ్చినప్పుడు ప్రత్యక్షంగా కలిసిన వాళ్ళలో సగం మంది జాతీయ అవార్డు వచ్చిన టైంలో కలిసి ఉండరు.

థియేటర్ వ్యవహారాలు, ఓటిటి హక్కులు, పైరసీ భూతం ఇలా బోలెడు సమస్యలు వేధిస్తుంటే ఎవరూ ఒక తాటిపైకి రావడం లేదు. తమ కొత్త రిలీజ్ హడావిడి అయిపోగానే మిగిలినవి తమకు సంబంధం లేదన్నట్టు వ్యవహరించే వాళ్లే ఎక్కువ. దిల్ రాజు, నాగవంశీ లాంటి అగ్ర నిర్మాతలు ఈ విషయంలో ఐక్యంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు కానీ ఎవరైనా వింటేగా. అందుకే అల్లు అరవింద్ ఇవాళ పబ్లిక్ స్టేజి మీద కుంపటి కామెంట్లు చేయాల్సి వచ్చింది. థియేటర్ల బంద్ ఇష్యూ వచ్చినప్పు కూడా ఇదే తంతు జరిగింది. ఆయన అన్నంత మాత్రాన ఏదో మార్పు వస్తుందని కాదు కానీ అందరూ కనీసం ఆలోచిస్తేనైనా మంచిదే.