ఏఎం రత్నం పరిస్థితేంటి?

ఒకప్పుడు సౌత్ ఇండియాలో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్లలో ఒకడిగా ఉండేవాడు ఏఎం రత్నం. ‘భారతీయుడు’ సహా అనేక బ్లాక్‌బస్టర్లు అందించిన ఘనత ఆయన సొంతం. అలాంటి నిర్మాత ఒక దశ దాటాక వరుస పరాజయాలతో సతమతం అయ్యారు. ముఖ్యంగా తన కొడుకు జ్యోతికృష్ణ దర్శకత్వంలో నిర్మించిన చిత్రాలు ఆయన కొంప ముంచాయి. దీంతో కొంత కాలం నిర్మాణానికే దూరం అయిపోయారు. అలాంటి టైంలో అజిత్‌తో ఆరంభం, ఎన్నై అరిందాల్, వేదాలం సినిమాలు తీసి మళ్లీ నిలదొక్కుకున్నారు. కానీ మళ్లీ జ్యోతికృష్ణనే ఆయన్ని దెబ్బ కొట్టాడు. అతను తీసిన ఆక్సిజన్, రూల్స్ రంజన్ సినిమాలు దారుణంగా బోల్తా కొట్టాయి. 

ఐతే వీటి వల్ల పోగొట్టుకున్న డబ్బులను పవన్ కళ్యాణ్ సినిమా వెనక్కి తీసుకు వస్తుందని అనుకున్నారు. కానీ భారీ అంచనాలతో మొదలై, ఒక దశ వరకు మంచి హైప్‌తోనే సాగిన ‘హరిహర వీరమల్లు’ విపరీతంగా ఆలస్యం కావడం, దర్శకుడు మారడంతో రత్నం తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. బడ్జెట్ తడిసి మోపెడైంది. అనుకున్న స్థాయిలో బిజినెస్ జరగలేదు. భారీ డెఫిషిట్‌తో సినిమాను రిలీజ్ చేశారు. విడుదల తర్వాత సినిమా బాగుంటే అదనపు ఆదాయం వస్తుందేమో అని చూశారు. కానీ ఇప్పుడు ఆయన అమ్మిన తక్కువ మొత్తాల్లో కూడా సగానికి మించి రికవర్ కాలేదు. బయ్యర్లందరి కొంప మునిగింది. ఇక రత్నం పరిస్థితి అయితే చెప్పాల్సిన పని లేదు. 

ఈ సినిమా మీద ఆయన దాదాపు వంద కోట్ల దాకా పోగొట్టుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు ఒక నిర్మాణ భాగస్వామి కూడా ఉన్నప్పటికీ.. ఇది రత్నంకు మామూలు దెబ్బ కాదు. నిజానికి పవన్ కళ్యాణ్ కొంత అడ్వాన్స్ మాత్రమే తీసుకుని సినిమా చేశారు. ఆయన పూర్తి పారితోషకం తీసుకోలేదు. రిలీజ్ తర్వాత వస్తే చూద్దాం అన్నారు. కానీ ఇప్పుడు తన పారితోషకం అడగడం సంగతి అటుంచితే.. రత్నంను ఆదుకోవడానికి పవనే ఏమైనా చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. పవన్‌తో ఇంకో సినిమా తీసి నష్టాలు పూడ్చుకుందామన్నా.. ముందు పెట్టుబడి పెట్టే స్థితిలోనూ రత్నం లేడు. ఈ నేపథ్యంలో మళ్లీ రత్నం నుంచి ఇంకో సినిమా చూస్తామా అన్నది సందేహమే.