ఎంత పెద్ద క్యాస్టింగ్ ఉన్నా అనుకున్న టైంలో, చెప్పిన క్వాలిటీతో సినిమా తీయడం, అది కూడా వాయిదాలు లేకుండా చూసుకోవడంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ కు మంచి పేరుంది. కూలిలో నాలుగు బాషల నుంచి అతి పెద్ద మల్టీస్టారర్స్ ని సెట్ చేసుకుని కూడా చెప్పిన సమయానికి విడుదలకు సిద్ధం చేయడం మాములు విషయం కాదు. అనౌన్స్ మెంట్ వీడియో దగ్గరి నుంచి ట్రైలర్ దాకా అతను ఎంచుకున్న ప్రమోషనల్ స్ట్రాటజీ అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లింది. అయితే బడ్జెట్ విషయంలో తను ఎంత పొదుపరో ఇవాళ హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున ద్వారా బయటికి వచ్చింది.
కూలీకి సంబంధించిన చివరి షెడ్యూల్ బ్యాంకాక్ లో తీస్తున్నారు. లాస్ట్ డే నాగార్జున దగ్గరికి వచ్చిన లోకేష్ షూటింగ్ అయిపోయిందని చెప్పాడు. దీని వల్ల నిర్మాత కళానిధి మారన్ కు 5 కోట్లు ఆదా అవుతాయని సంతోషంగా చెప్పాడు. దీంతో ఆశ్చర్యపోవడం నాగ్ వంతయ్యింది. నిజానికి ఒకవేళ ఇంకో 15 కోట్లు కావాలన్నా పెట్టేందుకు సన్ పిక్చర్స్ సిద్ధంగా ఉంది. అయినా సరే లోకేష్ అడ్వాంటేజ్ తీసుకోకుండా ప్రొడ్యూసర్ కి మిగిలించడం మంచి విషయం. అదేమీ చిన్న మొత్తం కాదు. ఆ డబ్బుతో మూడు రాష్ట్రాల్లో భారీ ఎత్తున పబ్లిసిటీని ఒంటి చేత్తో పూర్తి చేయొచ్చు. అందుకే ఈ పొదుపు విలువైంది.
మన దగ్గర పూరి జగన్నాథ్, అనిల్ రావిపూడి లాంటి దర్శకులు ఇలా ఫాస్ట్ మేకింగ్ విత్ లిమిటెడ్ బడ్జెట్ సూత్రాన్ని పాటిస్తారు. కానీ ప్యాన్ ఇండియా ఉచ్చులో పడ్డ కొందరు డైరెక్టర్లు మాత్రం కాలయాపనతో పాటు నిర్మాతల పర్సులను బరువెక్కిస్తారు. కూలిని ఏడాదిలోపే పూర్తి చేసిన లోకేష్ కనగరాజ్ కోలీవుడ్ కు మొదటి వెయ్యి కోట్ల గ్రాసర్ ఇస్తాడనే అంచనాలు బలంగా ఉన్నాయి. నటుడు సత్యరాజ్ ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నారు. వార్ 2 రూపంలో తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఆ మైలురాయి అందుతుందనే నమ్మకం రజని అభిమానుల్లో కనిపిస్తోంది. చూడాలి ఏం చేస్తారో.
Gulte Telugu Telugu Political and Movie News Updates