బాలీవుడ్ మూవీ సైయారా సంచలనాలు ఆగడం లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా వన్ ప్లస్ వన్ ఆఫర్లతో గత వారం విడుదలైన ఈ లవ్ స్టోరీ ఇంకా సెన్సేషన్లను కొనసాగిస్తూనే ఉంది. బుక్ మై షోలో గంటకు సగటున 30 వేల టికెట్లు అమ్ముడుపోవడమే దానికి నిదర్శనం. తాజాగా రిలీజైన హరిహర వీరమల్లు, మహావతార్ నరసింహ, తలవైన్ తలవి లాంటి ఇందులో కూడా సగం కూడా లేకపోవడం గమనించాల్సిన విషయం. ముఖ్యంగా యూత్ ఎగబడి చూస్తున వైనం సైయారాని ఎక్కడికో తీసుకెళ్తోంది. నగరాల్లో పాతికేళ్ల లోపు అమ్మాయిలు క్లైమాక్స్ కాగానే కన్నీటి పర్యంతం అవుతున్న వీడియోలు వైరలవుతున్నాయి.
ప్రొడక్షన్ హౌస్ ప్రకటించిన దాని ప్రకారం సైయారా ఇప్పటిదాకా 256 కోట్లు దాటేసింది. వీకెండ్ కాగానే ఇంకో వంద కోట్లు జోడించిన ఆశ్చర్యం లేదు. ఫైనల్ రన్ అయ్యేలోపు ఎంత లేదన్నా 500 కోట్లు సులభంగా దాటేస్తుందని ట్రేడ్ అంచనా. ముంబై, ఢిల్లీ లాంటి నగరాల్లోనే కాక పట్టణాల్లో సైతం హౌస్ ఫుల్స్ నమోదు చేస్తున్న సైయారాకు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి రన్ దక్కుతోంది. జిల్లా కేంద్రాల్లో వీరమల్లు వచ్చాక కూడా దీన్ని తీసేయలేదు. ప్రతి షోకు నలభై శాతం దాకా ఆక్యుపెన్సీలు ఉంటున్నాయని ట్రేడ్ రిపోర్ట్స్. ఇంతగా ప్రభంజనం సృష్టిస్తుందని ఎవరూ అంచనా వేయకపోవడం గమనార్హం.
కొత్తగా సైయారా మీద విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రేమ తీవ్రతను మరీ ఎక్కువగా చూపించారని, టీనేజ్ పిల్లల మనసుల మీద ప్రభావం కలిగేలా దర్శకుడు మోహిత్ సూరి అవసరానికి మించిన ఇంటెన్సిటీని పెట్టారని అంటున్నారు. తాజాగా ఉత్తరాదిలో ఒక ఇంటర్ అమ్మాయి కాలేజీ బిల్డింగ్ నుంచి దూకి చనిపోవడాన్ని దీనికి ముడి పెడుతూ కొందరు వివాదం చేయడానికి ప్రయత్నించడం కొత్త చర్చకు దారి తీస్తోంది. ఇంతా చేసి సాధారణ ప్రేక్షకులు సైయారా చూసి మహా గొప్పగా ఉందని అనడం లేదు. బాగుంది కానీ ఏదో అద్భుతం చూపించినట్టు అంత ఫీలవ్వాల్సింది ఏముందని ప్రశ్నిస్తున్నారు. అదే ట్విస్టు.
Gulte Telugu Telugu Political and Movie News Updates