రామ్ చరణ్ వినయ విధేయ రామలో అన్నయ్యగా నటించిన ప్రశాంత్ గుర్తున్నాడుగా. ఒకప్పుడు సోలో హీరోగా చెప్పుకోదగ్గ హిట్స్ ఇతనికి ఉండేవి. చామంతి, జీన్స్ లాంటి బ్లాక్ బస్టర్లు తనకు తెలుగులో మార్కెట్ తెచ్చి పెట్టాయి. తొంబై దశకంలో వెలిగిన దివ్యభారతి చివరి సినిమా తొలిముద్దులో కథానాయకుడు ఇతనే. ప్రశాంత్ కు క్రమం తప్పకుండా గ్యాప్ తీసుకునే అలవాటుంది. సడన్ గా మాయమైపోతాడు. తిరిగి వచ్చి ఏదో ఒక రీమేక్ తగులుకుంటాడు. తీరా చూస్తే అవేమో ఫ్లాప్ అవుతాయి. అయినా సరే పట్టువదలని విక్రమార్కుడిగా ట్రై చేస్తూనే ఉంటాడు. ఇప్పుడితని కన్ను ఓ టాలీవుడ్ మూవీ మీద పడింది.
నాని నిర్మాతగా వచ్చిన కోర్ట్ ఎంత సెన్సేషనల్ హిట్టో చూశాం. దాన్ని తమిళంలో రీమేక్ చేస్తారట. ప్రియదర్శి పోషించిన పాత్రను ప్రశాంత్, సాయికుమార్ క్యారెక్టర్ ని ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ తో చేయిస్తారని చెన్నై అప్డేట్. పవన్ కళ్యాణ్ సుస్వాగతం హీరోయిన్ దేవయాని కూతురు ఇనయాని దీంతో తెరకు పరిచయం చేస్తారని సమాచారం. వినడానికి బాగానే ఉంది కానీ కోర్ట్ ని తమిళ డబ్బింగ్ తో సహా నెట్ ఫ్లిక్స్ లో కొన్ని మిలియన్ల జనాలు చూసేశారు. సూర్య, శరత్ కుమార్ లాంటి సీనియర్ హీరోలు దాంట్లో చూసి ప్రత్యేకంగా మెచ్చుకుంటూ ట్వీట్లు, శుభాకాంక్షలు అందజేశారు. ఇదంతా మార్చి నాటి ముచ్చట.
ఇప్పుడీ కోర్ట్ ని ప్రశాంత్ లాంటి సీనియర్ చేయడం అంతగా వర్కౌట్ కాదనే అనుమానాలు రావడం సహజం. ఇలాగే నితిన్ మాస్ట్రో (హిందీ అందాదున్) ని తమిళంలో అందగన్ గా తీసి ఫ్లాప్ చవి చూసిన ప్రశాంత్ ఇప్పుడు కోర్ట్ ద్వారా ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి. నిజానికి ఇతను శ్రీకాంత్ లాగా సపోర్టింగ్ రోల్స్ కి మంచి ఛాయస్ అవుతాడు. కానీ ఇంకా హీరోగానే కనిపించాలనే తపనకు తండ్రి త్యాగరాజన్ ప్రోత్సాహం తోడవ్వడంతో ట్రయిల్స్ వేస్తూనే ఉన్నాడు. అన్నట్టు సింగం సిరీస్ దర్శకుడు హరితో ఇటీవలే ఒక భారీ యాక్షన్ మూవీ మొదలుపెట్టిన ప్రశాంత్ ఈసారి మాస్ చూపిస్తా అంటున్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates