టాలీవుడ్ విడుదల తేదీల విషయంలో నెలకొన్న గందరగోళం అటు నిర్మాతల బుర్రలనే కాదు అభిమానుల మెదళ్లను సైతం వేడెక్కిస్తోంది. ఎప్పుడు ఏ పోస్ట్ పోన్ గురించి వినాల్సి వస్తుందో, ఎప్పుడు ఎవరు ఎలాంటి బాంబు వేస్తారోనని చూడ్డంతోనే రోజులు గడిచిపోతున్నాయి. తాజాగా మరో ఇంటరెస్టింగ్ క్లాష్ కి రంగం సిద్ధమైనట్టు ఫిలింనగర్ టాక్. ఇప్పటికే పలు వాయిదాలు వేసుకుంటూ ఫ్యాన్స్ సహనంతో ఆడుకున్న అనుష్క ఘాటీని సెప్టెంబర్ 5 రిలీజ్ చేసే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. ఏప్రిల్, జూలై స్లాట్లను వదులుకున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా ప్రస్తుతం విఎఫ్ఎక్స్ పనుల్లో బిజీగా ఉంది.
దర్శకుడు క్రిష్ రూపొందించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ మూవీలో అనుష్క మునుపెన్నడూ చేయని వయొలెంట్ అవతారంలో కనిపించనుంది. ఇక అదే రోజు రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన ది గర్ల్ ఫ్రెండ్ కూడా విడుదలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. వరస బ్లాక్ బస్టర్లతో మంచి ఊపు మీదున్న రష్మిక మందన్న టైటిల్ రోల్ పోషించిన రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఇది. తనకున్న ఇమేజ్ దృష్ట్యా ప్యాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట నిర్మాతలు. బడ్జెట్ తక్కువే అయినా నిర్మాణంలో ఆలస్యం జరిగిన గర్ల్ ఫ్రెండ్ కి సెప్టెంబర్ 5 అయితే మంచి ఆప్షన్ అవుతుందనే దిశగా నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలిసింది.
ఇక్కడ ఇంకో ట్విస్టు ఉంది. సెప్టెంబర్ 5 ఆల్రెడీ తేజ సజ్జ మిరాయ్ తీసుకుంది. అఫీషియల్ గా ఎప్పుడో ప్రకటించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే దానికి కట్టుబడటం అనుమానంగానే ఉంది. సో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరోసారి క్లారిటీ ఇస్తే తప్ప దీని గురించి డిస్కషన్ ఆగదు. ఇది రాదని తెలిసే ఘాటీ, గర్ల్ ఫ్రెండ్ యూనిట్లు ఈ నిర్ణయం తీసుకుని ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం అనుష్క వర్సెస్ రష్మిక మందన్న కాంపిటీషన్ ఇంటరెస్టింగ్ గా ఉంటుంది. కాకపోతే రెండు సంబంధం లేని వేర్వేరు జానర్లు కాబట్టి పోటీ పరంగా టెన్షన్ ఉండదు. బాగుంటే రెండూ ఆడేస్తాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates