సినిమా విడుదల ఇంకో నెల రోజుల్లో ఉండగా తెలుగు రాష్ట్రాల వరకు వార్ 2కి సంబంధించి ఎలాంటి ప్రమోషన్స్ జరగకపోవడం జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో అసంతృప్తి కలిగిస్తోంది. కంటెంట్ ఇవ్వడంలో యష్ రాజ్ జాప్యం చేయడం ప్రధాన కారణమే అయినా, దీని వెనుక వార్ 2 హక్కులు కొన్న సితార సంస్థ నిర్మించిన కింగ్డమ్ ఉన్నట్టు పరిస్థితిని గమనిస్తే అర్థమవుతుంది. జూలై 31 ఎంతో దూరంలో లేదు. థియేటర్ అగ్రిమెంట్లు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. ఏరియాల వారీగా డిస్ట్రిబ్యూటర్లను లాక్ చేసుకోవడంలో సితార టీమ్ బిజీగా ఉంది. వీళ్ళలో అధిక శాతం రెండు వారాల తర్వాత రిలీజయ్యే వార్ 2 కు బిజినెస్ చేయబోతున్నారు.
సో ముందైతే కింగ్డమ్ వ్యవహారాలు పూర్తి కావాలి. చేతిలో టైం చాలా తక్కువగా ఉంది. రెండు వారాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు, మీడియా ఇంటరాక్షన్లు, బయట రాష్ట్రాల్లో వేడుకలు ఇలా అన్ని పూర్తి చేయాలి. వీటిలో కొన్ని సాధ్యం కాకపోవచ్చు కూడా. దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి చివరి దశ పనుల్లో ఊపిరి ఆడటం లేదు. ఫైనల్ కాపీ లాక్ చేసుకుని ఇంకో వారంలో సెన్సార్ కు వెళ్ళిపోవాలి. అనిరుద్ రీ రికార్డింగ్ ఇంకొంచెం బ్యాలన్స్ ఉందట. ఈ ఒత్తిడిలో వార్ 2 వైపు చూసేందుకు ఛాన్స్ లేదు. పైగా ఆ సినిమా నిర్మాత ఆదిత్య చోప్రా ఇంకా పబ్లిసిటీ మీద దృష్టి పెట్టలేదు.
ఇదంతా ఎలా ఉన్నా వార్ 2 ప్రచారాన్ని వీలైనంత త్వరగా మొదలుపెట్టాలి. పోటీలో ఉన్న కూలి కేవలం పాటలతోనే హైప్ ని పెంచేస్తోంది. దానికి అనిరుద్ రవిచందర్, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్ లాంటి సౌత్ ఆకర్షణలు చాలా ఉన్నాయి. కానీ దక్షిణాది వరకు చూసుకుంటే వార్ 2ని కేవలం జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ మీదే నడిపించాలి. హృతిక్ రోషన్ ఉన్నప్పటికీ మాస్ ఆడియన్స్ లో ఫుల్ పరంగా తారక్ దే పై చేయి అవుతుంది. సో వార్ 2 సౌండ్ ఎక్కువ వినిపించాలంటే ఆగస్ట్ 1 దాకా వెయిట్ చేయాల్సిందే. అప్డేట్స్ కూడా అప్పటి నుంచే ఊపందుకుంటాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates