నయనతారకా.. విడాకులా

ఫిలిం సెలబ్రెటీలు పెళ్లి చేసుకోవడం.. విడాకులు తీసుకోవడం.. చాలా మామూలుగా మారిపోయిన వ్యవహారం. గత కొన్నేళ్లలో పదుల సంఖ్యలో సినీ జంటలు విడిపోయాయి. అందుకే కొత్తగా ఎవరి గురించైనా విడాకుల వార్తలు వస్తే జనం ఏమీ ఆశ్చర్యపోవట్లేదు. కోలీవుడ్లో సెలబ్రేటెడ్ పెయిర్స్‌లో ఒకటైన నయనతార-విఘ్నేష్ శివన్ జంట విడిపోబోతున్నట్లు రెండు రోజులుగా ఓ వార్త ప్రచారంలోకి వస్తే.. నిజమేనేమో అనుకుంటున్నారు జనం. కానీ ఆ ప్రచారానికి నయనతార స్వయంగా తెరదించేసింది. 

తన భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి దిగిన ఒక లవ్లీ ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘మాపై వచ్చే సిల్లీ న్యూస్‌లను చూసినపుడు మా రియాక్షన్ ఇదే’’ అంటూ అంటూ కామెంట్ చేసింది నయన్. దీంతో ఆమె విడాకుల గురించి వస్తున్న వార్తలకు బ్రేక్ పడిపోయింది. ఇంతకీ నయన్-విఘ్నేష్ విడాకుల గురించి ప్రచారం జరగడానికి కారణమేంటన్నది ప్రశ్న. అందుకు నయన్ ఇటీవలే పెట్టి, డెలీట్ చేసిన ఒక పోస్టే కారణం. ‘‘తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం మీ పొరపాటు. నీ భర్త తప్పులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు’’ అంటూ నయన్ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టింది. 

కానీ కొన్ని గంటల్లోనే ఆ పోస్టును ఆమె డెలీట్ చేసింది. ఈలోపే పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు వైరల్ అయిపోయాయి. నయన్, విఘ్నేష్ విడిపోతున్నట్లుగా ప్రచారం ఊపందుకుంది. కానీ నయన్ దీనికి తెరదించేసింది. మరి ఆ పోస్టు ఆమె ఎందుకు పెట్టింది.. ఎందుకు డెలీట్ చేసింది అన్నది సస్పెన్సే. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న నయన్, విఘ్నేష్.. 2022లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. వారికి ఉయిర్ (ప్రాణం), ఉలగం (లోకం) అని పేర్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం నయన్ తమిళంలో రెండు మూడు సినిమాలు చేస్తూ.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తోంది.