నాగార్జున గారూ.. డ్రామా ఎక్కువైపోయింది సార్

‘బిగ్ బాస్’ నాలుగో సీజన్‌ చివరి దశకు వచ్చేస్తోంది. ఇప్పటికే షో నుంచి సగం మందికి అటు ఇటుగా పార్టిసిపెంట్లు హౌస్ నుంచి నిష్క్రమించారు. తాజాగా ఈ వీకెండ్లో మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు. ఐతే ఈ ఎపిసోడ్ చూసిన జనాలందరిదీ ఒకటే కంప్లైంట్.. షోలో మెలోడ్రామా ఎక్కువైపోయిందని.

హౌస్‌లో అందరూ కలిసి కొన్ని వారాలు గడిపాక బంధాలు ఏర్పడటం సహజం. అందువల్ల గ్రూప్ నుంచి ఒకరు వెళ్లిపోతుంటే మిగతా వాళ్లు బాధ పడటం మామూలే. కానీ ఎమోషన్ల డోస్ మరీ ఎక్కువైపోతే.. అతిగా అనిపించడమూ సహజమే. తాజా ఎపిసోడ్లో అయితే మెలో డ్రామా మరీ ఎక్కువైపోయింది. ఎన్నో ఏళ్లు కలిసున్నాక ఒక వ్యక్తి తమను వదిలి వెళ్లిపోతున్నట్లు.. ఏదో విషాదం చోటు చేసుకున్నట్లు టూమచ్‌గా స్పందించారు హౌస్ మేట్స్.

షో నుంచి ఎలిమినేట్ అయిన మెహబూబ్‌తో పాటు.. అతడికి దూరం అవుతున్నందుకు మిగతా కంటెస్టెట్లూ అతిగా స్పందిచారు. మెహబూబ్‌కు బాగా క్లోజ్ అయిన సోహైల్ అయితే బోరున ఏడ్చేసి నానా హంగామా చేశాడు. మెహబూబ్ వెళ్తూ వెళ్తూ ఒక్కొక్కరి గురించి మాట్లాడుతున్నపుడు కూడా అతిగా స్పందించాడు. ఓవర్ ఎమోషనల్ అయ్యాడు. మిగతా హౌస్ మేట్స్‌లో కూడా అభిజిత్ మినహా అందరూ అతిగానే స్పందించారు.

‘బిగ్ బాస్’ టీం ఉద్దేశపూర్వకంగా ఈ డోస్ పెంచే ప్రయత్నం చేసిందేమో అన్న సందేహాలు కలిగింది వ్యవహారం చూస్తే. ఎమోషన్లు ఒక స్థాయి వరకు ఉంటే అవి ప్లస్ అవుతాయి కానీ.. అవి ఓవర్ అయితే సెంటిమెంట్ సినిమాలా తయారవుతుంది. ఇలాంటివి ప్రేక్షకులకు ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. కాబట్టి ఈ షోను ఇంకోసారి రివైండ్ చేసుకుని చూస్తే నాగార్జున అండ్ టీంకు విషయం అర్థమవుతుంది. ఇకముందు వారాంతాల్లో ఎలిమినేషన్ టైంలో ఈ మెలోడ్రామా డోస్ కొంచెం తక్కువుండేలా చూసుకుంటే మంచిదేమో.