ఈ శుక్రవారం తన కలల ప్రాజెక్టు భక్త కన్నప్పతో ప్రేక్షకులను పలకరించాడు మంచు విష్ణు. రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో బిజినెస్ ఆఫర్లు రాకపోతే సొంతంగా రిలీజ్ చేసుకున్నాడు విష్ణు. అంతే కాక ఓటీటీ, ఇతర హక్కులను సైతం అమ్మలేదు. ఐతే సినిమా మంచి ఫలితాన్నందుకుని తన పెట్టుబడినంతా వెనక్కి తీసుకు వస్తుందని అతను బలంగా నమ్మాడు. వీకెండ్లో సినిమాకు వస్తున్న స్పందన చూస్తే విష్ణు నమ్మకం నిలిచేలాగే కనిపిస్తోంది. తొలి రెండు రోజుల్లో ఈ సినిమా రూ.40 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. ఆదివారం కూడా స్ట్రాంగ్గానే నిలబడింది.
మరి వీకెండ్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. మొత్తానికి కన్నప్పకు వస్తున్న స్పందనతో ఖుషీగా ఉన్న విష్ణు.. దీని తర్వాత ఏ సినిమా చేస్తాడన్నది ఆసక్తికరం. కన్నప్ప సక్సెస్ మీట్లో కొత్త సినిమా గురించి కబురేమీ చెప్పలేదు కానీ.. తాను నమ్మిన ప్రతి కథనూ చేయడానికి ఈ చిత్ర విజయం ఉత్సాహాన్నిచ్చిందని చెప్పాడు. తర్వాత పక్కా కమర్షియల్ సినిమా చేసే అవకాశాలున్నట్లు సంకేతాలు ఇచ్చాడు. ఆ సినిమాను ప్రభుదేవా డైరెక్ట్ చేయబోతున్నాడన్నది మంచు కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న కబురు. విష్ణుతో ప్రభుదేవాకు మంచి అనుబంధమే ఉంది. తన చివరి చిత్రం జిన్నాతో పాటు కన్నప్ప సినిమాకూ కొరియోగ్రఫీ చేశాడు ప్రభుదేవా.
న్యూజిలాండ్లో ‘కన్నప్ప’ టీంతో పాటు చాలా రోజులు ఉన్న ప్రభుదేవా.. కొరియోగ్రఫీలో మాత్రమే కాక మేకింగ్ పరంగానూ సాయం చేసినట్లు సమాచారం. తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన ప్రభుదేవా.. తర్వాత బాలీవుడ్కు వెళ్లి కొన్ని చిత్రాలు డైరెక్ట్ చేశాడు. ఐతే ఒక దశ తర్వాత దర్శకుడిగా వరుసగా ఫెయిల్యూర్లు రావడంతో బ్రేక్ తీసుకున్నాడు. నటుడిగానే సినిమాలు చేస్తూ వచ్చాడు. ఐతే ఇప్పుడు మళ్లీ విష్ణు సినిమాతో అతను దర్శకుడిగా రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభుదేవా సినిమాలంటేనే పక్కా మాస్ మసాలా టైపులో ఉంటాయి. మరి విష్ణుకు అతను మంచి మాస్ హిట్ ఇస్తాడేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates