‘కుబేర’ సినిమాలో హీరో ధనుషా, నాగార్జుననా అంటూ రెండు రోజులుగా వాళ్లిద్దరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కొట్టేసుకుంటుంటే.. ఇరు వర్గాలకూ బుద్ధి చెప్పేలా వ్యవహరించారు ఆ ఇద్దరు హీరోలు. ‘కుబేర’ సక్సెస్ మీట్లో ఇటు నాగ్, అటు ధనుష్ ఎంతో హుందాగా వ్యవహరించి.. అనవసరంగా ఫ్యాన్ వార్స్ చేస్తున్న అభిమానుల నోళ్లకు తాళాలు వేసేశారు. మొన్నటి ప్రెస్ మీట్లో ఈ కథ విన్నపుడు తనే హీరో అనిపించిందని నాగ్ చెబితే.. దాన్ని మరోలా అర్థం చేసుకుని గొడవ చేశారు ధనుష్ ఫ్యాన్స్. రిలీజ్కు ముందు దర్శకుడే హీరో అని చెప్పి, హిట్టయ్యాక తనే హీరో అంటూ క్రెడిట్ తీసుకుంటున్నాడంటూ నాగ్ మీద విమర్శలు చేశారు. కానీ నాగ్ దీనిపై సక్సెస్ సెలబ్రేషన్లలో క్లారిటీ ఇచ్చాడు.
ఈ చిత్రానికి సినిమాలోని పాత్రలే హీరోలని చెబుతూ.. అందరికీ మించి దర్శకుడు శేఖర్ కమ్ములనే హీరో అని స్పష్టత ఇచ్చాడు. ఈ సందర్భంగా తన మీద నెగెటివ్గా మీమ్స్ వేసిన, వార్తలు రాసిన వాళ్లందరి గురించి కూడా ఆయన ప్రస్తావించాడు. నాగ్ మాట్లాడ్డానికి ముందే ధనుష్ తనదైన శైలిలో వ్యవహరించి శభాష్ అనిపించుకున్నాడు. ఇలాంటి వేడుకల్లో ముఖ్య అతిథి కంటే ముందు.. చివరగా హీరో మాట్లాడ్డం ఆనవాయితీ. ‘కుబేర’ హీరో ధనుషే అన్న ఉద్దేశంతో యాంకర్ ముందు నాగార్జునను ప్రసంగం కోసం స్టేజ్ మీదికి పిలిచారు. ఐతే ధనుష్ నాగ్ను ఆపి.. వేగంగా స్టేజ్ మీదికి వెళ్లిపోయాడు.
ఆయన కంటే ముందు నేను మాట్లాడాలి.. తర్వాత సార్ మాట్లాడాలి అంటూ నాగ్కు తగిన గౌరవాన్నిచ్చాడు. హీరో ఎవరన్నది అప్రస్తుతం, సీనియర్గా నాగ్ను గౌరవించాలని ధనుష్ భావించి ఉండొచ్చు. ఇలా చేయడం ద్వారా ధనుష్ తన ఉన్నత వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు. హీరో ఎవరంటూ సోషల్ మీడియాలో కొట్టేసుకుంటున్న వారికి తనదైన శైలిలో బదులిచ్చాడని చెప్పొచ్చు. మరోవైపు ఈ వేడుకకు అతిథిగా వచ్చిన చిరు గురించి మాట్లాడుతూ.. ఏ పని చేసినా ఓం రాసినట్లు, సినిమాల విషయంలో చిరు పేరు తలుచుకుంటామంటూ గొప్ప కామెంట్ చేశాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates