మెగాస్టార్ మార్కు చమక్కులు ట్విస్టులు

కుబేర సక్సెస్ మీట్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది ముఖ్యఅతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి. ఇలాంటి బోలెడు వేడుకల్లో ఆయన భాగం పంచుకోడం, టీమ్ ను మెచ్చుకుంటూ పొగడ్తలు గుప్పించడం మాములే కానీ ఇవాళ మాత్రం కొన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయాలున్నాయి. దీపక్ గా కుబేరలో నటించడం ద్వారా నాగార్జున తనకు స్ఫూర్తిగా నిలిచాడని, భవిష్యత్తులో ఇలాంటి క్యారెక్టర్లు లేదా వెబ్ మూవీస్ చేయాల్సి వస్తే తాను కూడా సిద్ధంగా ఉంటాననే రీతిలో సిగ్నల్ ఇవ్వడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇలా అన్నానని నేరుగా ఉదయం ఇంటికి రావొద్దంటూ నిర్మాతలను ఉద్దేశించి చెప్పడం పేలింది.

ఇక ప్రొడ్యూసర్ సునీల్ నారంగ్ గురించి వాళ్ళ కుటుంబంతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నైజామ్ లో ఒకప్పుడు వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తన సినిమాలు ఆడి గొప్ప లాభాలు ఇచ్చాయని, తర్వాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ ద్వారా పంపిణి మొదలుపెట్టాక వీళ్ళతో కనెక్షన్ తగ్గిపోయిందని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడెందుకు చెప్పారన్నట్టు సునీల్ నారంగ్ సరదాగా ఎక్స్ ప్రెషన్ పెట్టడం కెమెరా దృష్టి దాటకుండా పోలేదు. అప్పుడు ఛాన్స్ మిస్సయినా వాళ్ళ పిల్లలతో సినిమా చేయడం ద్వారా థర్డ్ జనరేషన్ తోనూ తన అనుబంధాన్ని కొనసాగిస్తానని చెప్పడం చప్పట్లు అందుకుంది.

ధనుష్ ని ప్రశంసలతో ముంచెత్తిన చిరంజీవి కుబేరలో దేవాగా ఇండియాలో ఏ నటుడు తనను సరితూగడని, నేషనల్ అవార్డు రావడం ఖాయమని, ఇస్తే వాటికి గౌరవంగా ఉంటుందని చెప్పడం ధనుష్ ని ఎమోషనల్ చేసింది. రష్మిక మందన్నని ఇంటర్నేషనల్ క్రష్ అని చెప్పడమే కాదు, సమీరాగా తన అమాయకత్వం చూడాలని ఉందిలో సౌందర్యని గుర్తు చేసిందని చెప్పడం ఒక్కసారిగా ఆమెను సంతోషంలో ముంచెత్తింది. తోట తరణితో అనుబంధాన్ని సరదాగా గుర్తు చేసుకున్న మెగాస్టార్ మొత్తానికి తనదైన చమక్కులు, ట్విస్టులతో కుబేర ఈవెంట్ కి ప్రత్యేక కళ తీసుకొచ్చిన మాట వాస్తవం.