ధనుష్, రష్మిక మందన్న జంట అంటే ఏ దర్శకుడైనా కనీసం ఒక లవ్ సాంగ్ లేదా డ్యూయెట్ పెడతాడు. ఇద్దరి మధ్య మంచి ప్రేమ సన్నివేశాలు రాసుకుంటాడు. కానీ కుబేరలో అవేవి కనిపించవు. పైగా ధనుష్ మీద చీటికీ మాటికీ కయ్యమని తిట్టే రష్మికనే ఎక్కువగా చూస్తాం. వీళిద్దరి కాంబోకు తోడుగా నాగార్జున లాంటి వర్సటైల్ సీనియర్ స్టార్ దొరికితే ఎలివేషన్లు ఓ రేంజ్ లో పడాలి. కానీ కుబేరలో ఆయన అతి మాములుగా కనిపిస్తాడు. ఒక గన్ ఫైర్ ఎపిసోడ్ తప్ప ఎక్కడా పోరాటాలు చేయడు. ఒక మధ్యతరగతి వ్యక్తిగా కుటుంబం కోసం స్వంత సిద్ధాంతాలను వదిలి రాజీ పడతాడు. నాగ్ లాంటి హీరోతో ఇవి చాలా రిస్క్.
కానీ ఇవన్నీ బ్యాలన్స్ చేయడంలో శేఖర్ కమ్ముల గొప్ప విజయం సాధించాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ఒక సీరియస్ క్రైమ్ కి సందేశం జోడించి మాస్ మసాలా లేకుండా థియేటర్లను జనాలతో నింపడం ఆయనకు మాత్రమే తెలిసిన విద్య. శంకర్ దాదా ఎంబిబిఎస్ ఆడుతున్న టైంలోనే ఆనంద్ రిలీజ్ చేసి హిట్టు కొట్టడం నుంచే తన క్యాలిబర్ రుజువు చేసుకున్న శేఖర్ కమ్ముల పాతిక సంవత్సరాల తర్వాత కూడా తన బ్రాండ్ ని అలాగే కాపాడుకుంటూ వస్తున్నారు. మూస జోలికి ఏనాడూ వెళ్లకుండా ఎంత ఆలస్యమైనా సరే తాను నమ్మిన కథలనే ప్రేక్షకులకు చెబుతూ మెప్పిస్తూ వచ్చారు.
ఇప్పుడు కుబేర రూపంలో శేఖర్ కమ్ముల తనలో మరో కోణాన్ని ఆవిష్కరించారు. నటీనటులు ఛాలెంజ్ గా ఫీలయ్యే సన్నివేశాలు రాసుకోవడం ద్వారా వాళ్ళకు ప్రేక్షకుల గౌరవాన్ని మరింత పెరిగేలా చేస్తున్నారు. ధనుష్ ఇంతకన్నా గొప్పగా గతంలో వేరే సినిమాల్లో నటించినప్పటికీ కుబేర అంత సెన్సిబుల్ గా ఆయా డైరెక్టర్లు చూపించలేకపోయారు. అందుకే కమ్ముల ఈ విషయంలో ప్రత్యేకంగా నిలుస్తున్నారు. భారీ బడ్జెట్ తో తన మీద నిర్మాతలు పెట్టుకున్న నమ్మకాన్ని, రిస్కీ పాత్ర ద్వారా నాగార్జున చూపించిన కాన్ఫిడెన్స్ ని నిలబెట్టుకున్న శేఖర్ కమ్ముల నెక్స్ట్ నానితో చేసినా ఇంకెవరితో చేతులు కలిపినా అంచనాలు ఎక్కడికో వెళ్లిపోతాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates