అక్కినేని ఫ్యాన్స్ ముఖ్యంగా నాగ చైతన్య అభిమానులకు చాలా స్పెషల్ మూవీ ఏ మాయ చేసావే. విడాకులు తీసుకున్నారు కానీ పెళ్లి దాకా చైతు, సమంతాను తీసుకెళ్లింది ఈ సినిమానే. గౌతమ్ మీనన్ దర్శకత్వం, ఏఆర్ రెహమాన్ సంగీతం, హీరో హీరోయిన్ మధ్య క్యూట్ లవ్ స్టోరీ వెరసి అప్పటి బాక్సాఫీస్ లెక్కల్లో మంచి హిట్ గా నిలిచింది. రికార్డులు బద్దలుకొట్టలేదు కానీ యువత హృదయాలను కొల్లగొట్టింది. ఇప్పటికీ ఓటిటి, యూట్యూబ్ లో దీనికి భారీ ఎత్తున వ్యూస్ వస్తుంటాయి. 2010లో వచ్చిన ఈ కల్ట్ స్టోరీ విడుదలై 15 సంవత్సరాలు గడిచిపోయాయి. వచ్చే నెల జూలై 18 దీన్ని మళ్ళీ థియేటర్లకు తీసుకొస్తున్నారు.
అసలు విశేషం ఏంటంటే డేట్ పరంగా ఏ మాయ చేసావేకి మంచి తేదీ దొరికింది. జూలై 18 కొత్త రిలీజులు లేవు. హరిహర వీరమల్లు 24, కింగ్ డమ్ 25 వస్తాయనే వార్తల నేపథ్యంలో ఆ స్లాట్ ఖాళీగా ఉంది. దీనికి ముందు వారం అనుష్క ఘాటీ, సుహాస్ ఓ భామ అయ్యో రామా మాత్రమే వచ్చి ఉంటాయి. ఎలాగూ రీ రిలీజుల లైఫ్ మహా అయితే వారమే కాబట్టి ఆ లోగా ఏ మాయ చేసావే మొత్తం రాబట్టుకోవచ్చు. ఒకవేళ దీనికి ప్రమోషన్లు చేసే పనైతే సమంత వస్తుందనే ప్రచారానికి స్వయంగా తనే చెక్ పెట్టింది. ఎలాంటి పబ్లిసిటీలో భాగం వహించే ఆలోచన లేదని, తనకు దీంతో సంబంధం లేదని కొట్టి పారేసింది.
ఇంకోవైపు చైతు కూడా ఆసక్తి చూపించకపోవచ్చు. ఎందుకంటే ఇటీవలే శోభితకు మూడుముళ్లు వేశాక కొత్త జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏ మాయ చేసావే ప్రమోషన్ల పేరుతో బయటికొచ్చి ఇంటర్వ్యూలు గట్రా ఇస్తే సమంతాతో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్, ప్రేమ బంధం తదితర విషయాలన్నీ మాట్లాడాలి. ఇప్పుడవి అప్రస్తుతం. తనను అడిగిన డిస్ట్రిబ్యూటర్స్ కి చైతు సున్నితంగా నో చెప్పినట్టు తెలిసింది. గౌతమ్ మీనన్, రెహమాన్ లతో ఏదైనా ఈవెంట్ లాంటిది ప్లాన్ చేసే ఆలోచనలో టీమ్ ఉందట. నిజ జీవితంలో విడిపోయిన జంటను మళ్ళీ తెరమీద చూసేందుకు మూవీ లవర్స్ ఏ మేరకు ఆసక్తి కనబరుస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates