వాయిదాల పర్వంలో నలిగిపోతున్న హరిహర వీరమల్లు జూన్ 12 నుంచి తప్పుకున్నాక మళ్ళీ కొత్త డేట్ ఎప్పుడనేది టీమ్ ప్రకటించలేదు. నిన్న వదిలిన అఫీషియల్ నోట్ లో ట్రైలర్ తో పాటు దాన్ని రివీల్ చేస్తామని చెప్పారు తప్పించి ఫలానా డేట్, టైం అనేది అందులో లేదు. మరి ఈ నెలలోనే వస్తుందా లేక జూలైకి వెళ్తుందా అనే దాని మీద రకరకాల ఊహాగానాలున్నాయి. ఇలా పోస్ట్ పోన్ల వల్ల బజ్ తీవ్రంగా ప్రభావితం చెందిన సంగతి తెలిసిందే. నిర్మాత ఏఏం రత్నం ఇస్తున్న ఇంటర్వ్యూల్లో కంటెంట్ గురించి ఓ రేంజ్ ఎలివేషన్లు ఇస్తున్నప్పటికీ అభిమానుల్లో పూర్తి నమ్మకం రావడానికి అవి సరిపోవడం లేదు.
తాజాగా జ్యోతికృష్ణ ఓ వేడుకలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఈ సినిమాని మూడు సార్లు చూసి గంట సేపు మెచ్చుకున్నారని ఎగ్జైట్ మెంట్ తో చెప్పుకొచ్చాడు. అంతేకాదు తనతో మరో సినిమా చేయాలనే కోరికను వ్యక్తం చేశారని ఇటీవల జరిగిన ఘటనని గుర్తు చేసుకున్నారు. టాలెంట్ ని గుర్తించడంలో ఆయన తర్వాతే ఎవరైనా అనే స్థాయిలో పొగడ్తల వర్షం కురిపించారు. నిజంగా పవన్ కు మూడుసార్లు చూసేంత టైం ఇప్పుడు ఉందా అనే లాజిక్ కి సమాధానం దొరకడం కష్టం కానీ ఒకవేళ నిజమైతే మాత్రం బొమ్మ హిట్టేనని ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే పవర్ స్టార్ గతంలో ఇన్ని షోలు ఏ సినిమాకు వేసుకోలేదు.
ఫ్యాన్స్ కి ఉత్సాహం నింపడం కోసం జ్యోతికృష్ణ ఇలా అన్నారో లేక వాస్తవంగానే పవన్ అంత ఎంజాయ్ చేశారో తెలియదు ఒకవేళ జరిగి ఉంటే సంతోషమే. ఎందుకంటే ఆయన చెప్పిన ప్రకారమే బడ్జెట్ రెండు వందల యాభై కోట్లు దాటేసింది. ఇంత రికవర్ కావాలంటే ఎక్స్ ట్రాడినరి టాక్ తో పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఒకవేళ జూన్ 12కే కట్టుబడి ఉంటే ఇది సాధ్యం కాకపోయేది. హడావిడి వల్ల ఓపెనింగ్స్ తో పాటు టాక్ ప్రభావితం చెందేది. సరే ఎంత లేట్ అయినా బెస్ట్ అవ్వాలనేది ఆడియన్స్ కోరిక. నిర్మాత, దర్శకుడి కాన్ఫిడెన్స్ చూస్తుంటే అదే అనిపిస్తోంది. ఇక రిలీజయ్యాక అంచనాలు అందుకోవడమే బ్యాలన్స్.