గత ఏడాది పుష్ప: ది రూల్ చిత్రంతో భారీ విజయాన్నందుకున్నాడు అల్లు అర్జున్. దీని తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చారిత్రక నేపథ్యంలో సాగే సినిమా చేయాల్సింది బన్నీ. కానీ అది వెనక్కి వెళ్లి.. దాని స్థానంలోకి అట్లీ చిత్రం వచ్చింది. రొటీన్ మాస్ మసాలా సినిమాలు తీసే అట్లీతో సినిమా ఏంటి అని ముందు బన్నీ ఫ్యాన్స్ ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు కానీ.. ఈ సినిమా ప్రి విజువలైజేషన్ వీడియో వచ్చాక మాత్రం వారి ఆలోచన మారింది. అట్లీ ఈసారి హాలీవుడ్ స్థాయి సైఫై థ్రిల్లర్ ఏదో ట్రై చేస్తున్నాడని.. ఈ సినిమా లేవెలే వేరుగా ఉండబోతోందని ఆ వీడియో సంకేతాలు ఇచ్చింది.
ఈ సినిమా నుంచి ఇప్పుడు తర్వాతి అప్డేట్ రెడీ అయింది. శనివారం ఉదయం 11 గంటలకు ఆ అప్డేట్ను పంచుకోనున్నట్లు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. బన్నీ-అట్లీ సినిమా నుంచి రాబోతున్న అప్డేట్ హీరోయిన్ గురించే అని సమాచారం. ఇటీవలే సందీప్ రెడ్డి వంగ-ప్రభాస్ల చిత్రం స్పిరిట్ నుంచి అనూహ్య పరిస్థితుల్లో వైదొలిగిన దీపికా పదుకొనేను బన్నీకి జోడీగా తీసుకుంటున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడా విషయాన్నే అధికారికంగా ప్రకటించబోతున్నారట.
మరి దీపిక ఈ సినిమాలో భాగం కానున్నట్లు జస్ట్ సమాచారం ఇస్తారా.. లేక ఆమె ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేస్తారా అన్నది చూడాలి. ఈ చిత్రంలో ఇంకో ఇద్దరు స్టార్ హీరోయిన్లకు చోటు ఉంది. అందులో ఒకరు జాన్వి కపూర్ కాగా.. మరొకరు మృణాల్ ఠాకూర్ అని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో బన్నీ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. మూడు పాత్రలకు ముగ్గురు హీరోయిన్లు జోడీ అన్నమాట. బన్నీ పాత్రల్లో ఒకటి నెగెటివ్ షేడ్స్తో ఉంటుందని.. అదే విలన్ క్యారెక్టర్ అని కూడా అంటున్నారు. సన్ పిక్చర్స్ రూ.600 కోట్లకు పైగా బడ్జెట్లో ఈ సినిమాను నిర్మించబోతోంది.