=

ఓటిటిని భయపెట్టిన అమీర్ ఖాన్ ప్లాన్

జూన్ 20 వస్తున్న సితారే జమీన్ పర్ థియేటర్ రన్ అయ్యాక రెగ్యులర్ ఓటిటిలకు ఇవ్వకుండా యూట్యూబ్ లో పే పర్ వ్యూ మోడల్ లో రిలీజ్ చేయాలని అమీర్ ఖాన్ నిర్ణయించుకోవడం ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది. దీంతో ముందు అరవై కోట్లు ఇస్తామన్న ఒక ప్రముఖ ఓటిటి సంస్థ ఇప్పుడు ఏకంగా నూటా ఇరవై అయిదు కోట్లు ఆఫర్ చేసిందని ముంబై రిపోర్ట్. ఇందులో నిజమెంతుందో కానీ రెట్టింపు మొత్తం రావడంతో అమీర్ సానుకూలంగా ఆలోచిస్తున్నాడట. అయితే కొద్దిరోజుల క్రితమే యూట్యూబ్ బృందంతో చర్చలు జరిపి ఈ మోడల్ సాధ్యాసాధ్యాలు చర్చించిన అమీర్ ఇప్పుడు మనసు మార్చుకుంటాడా అంటే డౌటే.

నిజానికి ఆ ఓటిటి భయపడటంలో అర్థముంది. ఒకవేళ సితారే జమీన్ పర్ కనక యూట్యూబ్ లో వర్కౌట్ అయితే మిగిలిన నిర్మాతలు కూడా దాన్నే ఫాలో అయ్యే ప్రమాదముంది. అప్పుడు ఆడియన్స్ టికెట్ డబ్బులను యూట్యూబ్ లో పెట్టి ఫ్యామిలీ మొత్తం ఇంట్లోనే కొత్త సినిమాలు చూస్తారు. ఇది ప్రస్తుతం ఒకదానితో మొదలై క్రమంగా అందరికీ పాకితే అప్పుడు ఓటిటిలకు పెద్ద దెబ్బ పడుతుంది. అందుకే డబుల్ ఆఫర్ ఇచ్చేందుకు వెనుకాడటం లేదట. సితారే జమీన్ పర్ విడుదల సందర్భంగా మొదటి భాగం తారే జమీన్ పర్ రెండు వారాల పాటు యూట్యూబ్ లో ఉచితంగా స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు తెలిసింది.

ఇప్పుడీ పరిణామాల పట్ల ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. సితారే జమీన్ పర్ మీద ఆశించిన బజ్ లేదు. హాలీవుడ్ మూవీ ఛాంపియన్స్ కి రీమేక్ గా రూపొందుతున్న ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాలో దివ్యాంగులకు శిక్షణ ఇచ్చే కోచ్ గా అమీర్ ఖాన్ కనిపిస్తాడు. జోడిగా జెనీలియా డిసౌజా నటించడం విశేషం. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించిన సితారే జమీన్ పర్ ని త్వరలో జపాన్, చైనా దేశాల్లో రిలీజ్ చేసేందుకు అమీర్ ప్లానింగ్ లో ఉన్నాడు. రాబోయే ఆరేడు నెలల్లో ఇది జరిగిపోయేలా చూస్తున్నాడు. దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ అక్కడ అద్భుత విజయాలు సాధించిన సంగతి తెలిసిందే.