థియేట‌ర్ల క‌ష్టాలు.. యువ నిర్మాత స‌రిగ్గా చెప్పాడు

దేశ‌వ్యాప్తంగా థియేట‌ర్ల ప‌రిస్థితి రోజు రోజుకూ ఇబ్బందిక‌రంగా మారుతుండ‌డం ఆందోళ‌న రేకెత్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. థియేట‌ర్ల‌కు వ‌చ్చే ప్రేక్ష‌కుల సంఖ్య అంత‌కంత‌కూ త‌గ్గిపోతోంది. వేస‌వి లాంటి క్రేజీ సీజ‌న్లో థియేట‌ర్లు వెల‌వెల‌బోతున్నాయి. ఇదే స‌మ‌యంలో అద్దె బ‌దులు ప‌ర్సంటేజీ విధానం డిమాండ్ చేస్తూ థియేట‌ర్ల‌ను మూసి వేయ‌డానికి తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిట‌ర్లు నిర్ణ‌యించ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. జూన్ 1 నుంచి ఈ మేర‌కు స‌మ్మె చేయాల‌ని అనుకున్నారుకానీ.. తాత్కాలికంగా దానిపై వెన‌క్కి త‌గ్గారు.

ఈ ప‌రిణామాల‌పై యువ నిర్మాత ఎస్కేఎన్ ఒక సినిమా ప్రమోష‌న‌ల్ ఈవెంట్లో ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశాడు. అస‌లు థియేట‌ర్ల‌కు జ‌న‌మే రావ‌ట్లేదంటే.. ఆదాయ పంపిణీ విష‌యంలో వివాద‌మేంటి అని ఆయ‌న ప్ర‌శ్నించాడు. ఆదాయం బాగా వ‌స్తుంటే క‌దా అందులో పంప‌కాల‌పై పేచీ పెట్టాల్సింది అని ఆయ‌న అన్నారు. హార్ట్ ఎటాక్ వ‌చ్చి ఐసీయూలో చేరిన పేషెంట్‌కి ఫేషియ‌ల్ చేయాలా, పెడిక్యూర్ చేయాలా అని చూస్తున్న‌ట్లుగా ఈ వ్య‌వ‌హారం ఉంద‌ని.. ముందు పేషెంట్‌ను బ‌తికించ‌డం ముఖ్య‌మ‌ని ఎస్కేఎన్ వ్యాఖ్యానించాడు.

థియేట‌ర్ల‌కు జ‌నం రావ‌డం క్ర‌మ క్ర‌మంగా ఎందుకు త‌గ్గిపోతోందో ఆలోచించాల‌ని.. వాళ్ల కంప్లైంట్స్ ఏంటో గుర్తించి ప‌రిష్కారం క‌నుగొనాల‌ని ఎస్కేన్ అభిప్రాయ‌ప‌డ్డాడు. టికెట్ల ధ‌ర‌లు ఎక్కువ అని.. పాప్ కార్న్ స‌హా స్నాక్స్ ధ‌ర‌లు కూడా ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ప్రేక్ష‌కులు అంటున్నార‌ని.. ఇందుకు అనుగుణంగా మార్పులు జ‌ర‌గాల‌ని ఎస్కేఎన్ అన్నాడు.

ఫ్లెక్సీ ప్రైసింగ్ వ‌స్తే డిమాండ్ ఉన్న రోజుల్లో రేట్లు ఎక్కువ ఉన్నా.. మిగ‌తా రోజుల్లో త‌గ్గించే అవ‌కాశం ఉంటుంద‌న్నాడు. అలాగే పెద్ద హీరోలు ఏడాదికి ఒక‌టికి త‌క్కువ కాకుండా సినిమాలు చేయ‌డం.. వీలైతే ఏడాదిన్న‌ర‌కు రెండు సినిమాలు పూర్తి చేయ‌డం చాలా అవ‌స‌ర‌మ‌ని ఎస్కేఎన్ అభిప్రాయ‌ప‌డ్డాడు. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ఏడాదికో సినిమా చేస్తున్నాడ‌ని.. ఇటీవ‌ల తాను క‌లిసిన‌పుడు అల్లు అర్జున్ సైతం ఏడాదిన్న‌ర వ్య‌వ‌ధిలో రెండు సినిమాలు చేసేలా ప్లాన్ చేసుకుంటున్న‌ట్లు చెప్పార‌ని ఎస్కేఎన్ వెల్ల‌డించాడు. ఇలా కీల‌క‌మైన స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకున్నాక థియేట‌ర్ల ఆదాయంలో పంప‌కాల గురించి ఆలోచించ‌వ‌చ్చ‌ని ఎస్కేఎన్ అన్నాడు.