బాలీవుడ్ మార్కెట్ కోసమో లేదా తెలుగులో సరైన ఆప్షన్ లేకపోవడమో హిందీ హీరోయిన్లను తీసుకోవడం టాలీవుడ్ లో ఎప్పటి నుంచో జరుగుతున్నదే. ఇది తప్పేం కాదు. కాకపోతే వాళ్ళ గొంతెమ్మ కోరికలను నెరవేర్చుకుంటూ పోవడం వల్ల నిర్మాతల మీద విపరీతమైన భారం పడిన సందర్భాలు బోలెడున్నాయి. చాలా మటుకు అవి బయటికి రాలేదు. ఎందుకొచ్చిన తలనెప్పి లెమ్మని ఊరుకున్న ప్రొడ్యూసర్లే ఎక్కువ. కానీ సందీప్ రెడ్డి వంగా నేనా తరహా కాదని నిరూపిస్తున్నారు. ప్రభాస్ స్పిరిట్ నుంచి దీపికా పదుకునేని తప్పించారనే వార్త నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాని ఊపేస్తోంది. కారణాలు వింటే సందీపే రైటంటారు.
ఇన్ సైడ్ రిపోర్ట్స్ ప్రకారం దీపికా పదుకునే స్పిరిట్ టీమ్ ముందు చాలా డిమాండ్స్ పెట్టిందట. రోజు ఆరుగంటలకు మించి పని చేయకపోవడం, వంద రోజుల్లోనే తన పార్ట్ మొత్తం పూర్తి చేయాలని చెప్పడం, ఒకవేళ అంతకన్నా ఎక్కువైతే భారీ మొత్తంలో పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడం, తనతో పాటు వ్యక్తిగత స్టాఫ్ కు ముంబై నుంచి షూటింగ్ జరుగుతున్న ప్రాంతాలకు సంబంధించిన విపరీతమైన ఖర్చులు వగైరా ఇలా పెద్ద లిస్టు పెట్టిందట. దీంతో ఇదంతా జరిగే పని కాదని భావించిన సందీప్ వంగా వెంటనే ఆమెతో కాంట్రాక్ట్ రద్దు చేసుకుని కొత్త ఆప్షన్ చూసే పనిలో పడ్డారని అంతర్గత సమాచారం.
నిజానికి సందీప్ వంగా కొత్త మొహాలకు ప్రాధాన్యం ఇస్తాడు. అర్జున్ రెడ్డిలో చేసింది అదే. కానీ కబీర్ సింగ్, యానిమల్ హిందీ సినిమాలు కావడంతో ఇమేజ్ ఉన్న కియారా అద్వానీ, రష్మిక మందన్నను తీసుకున్నాడు. స్పిరిట్ కి సైతం అదే ఫాలో అవ్వాలని అనుకున్నారట. తీరా చూస్తే దీపికా డిమాండ్లకు చిరాకొచ్చి మనసు మార్చుకున్నారని అంటున్నారు. నిర్మాణ భాగస్వామిగా ఉన్న టి సిరీస్ సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కుదరలేదట. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ, ది రాజా సాబ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇవి కాగానే స్పిరిట్ ని ఏకధాటిగా ఆరు నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో సందీప్ ఉన్నట్టు టాక్.