పవన్‍ సినిమాకి ప్లస్సే అయింది

వకీల్‍ సాబ్‍తో పాటు క్రిష్‍ దర్శకత్వంలో జానపద చిత్రాన్ని మొదలు పెట్టిన పవన్‍ కళ్యాణ్‍ ఆ సినిమా కోసం దాదాపు నెల రోజులు షూటింగ్‍ కూడా చేసాడు. లాక్‍డౌన్‍ టైమ్‍లో పవన్‍ మళ్లీ సెట్స్కి రావడం ఆలస్యమవుతుందని తెలుసుకుని క్రిష్‍ వేరే చిన్న సినిమా చేసేసాడు. వకీల్‍ సాబ్‍ పూర్తి కాగానే క్రిష్‍ చిత్రం సెట్స్కి పవన్‍ వెళ్లాల్సి వుంది. కానీ మధ్యలో పవన్‍ ‘అయ్యప్పనుమ్‍ కోశియుమ్‍’ రీమేక్‍ చేయాలని డిసైడ్‍ అయ్యాడు.

ఈ చిత్రానికి పవన్‍ కేవలం నలభై రోజుల కాల్షీట్లు ఇస్తే చాలట. అందుకని మిగతా సినిమాలు వెనక్కి నెట్టి క్రిష్‍ని మరింత వెయిటింగ్‍లో పెట్టేసాడు పవర్‍స్టార్‍. అయితే ఈ గ్యాప్‍ని క్రిష్‍ ఈ చిత్రానికి ప్లస్‍ అయ్యేలా చూసుకుంటున్నాడు. పవన్‍తో సినిమా చాలా సడన్‍గా సెట్‍ అవడంతో క్రిష్‍కి ప్రీ ప్రొడక్షన్‍కి కానీ, స్క్రిప్ట్ బెటర్‍మెంట్‍కి కానీ ఎక్కువ సమయం దొరకలేదు. హడావుడిగా సెట్స్ మీదకు వెళ్లిపోయాడు.

ఇప్పుడు గ్యాప్‍ రావడంతో క్రిష్‍ మరో చిత్రమేదీ ప్లాన్‍ చేయకుండా పవన్‍ సినిమా కథకే మెరుగులు దిద్దుతున్నాడు. పవన్‍ మళ్లీ అందుబాటులోకి వచ్చేసరికి అయిదారు నెలలలో షూటింగ్‍ పూర్తి చేసేలా క్రిష్‍ పకడ్బందీగా అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు. మరి ఈలోగా పవన్‍కి ఇంకేదైనా రీమేక్‍పైకి మనసు మళ్లకపోతే అయ్యప్పనుమ్‍ కోశియుమ్‍ రీమేక్‍ తర్వాత క్రిష్‍ సినిమానే రిలీజ్‍ అవుతుంది.