ఈ నెల 30 విడుదల కానున్న భైరవం ట్రైలర్ చూశాక అంచనాల్లో మార్పులు వచ్చేశాయి. తమిళ సూపర్ హిట్ గరుడన్ రీమేక్ గా రూపొందిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రలు పోషించగా అదితి శంకర్ హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఈ మధ్య రీమేకులు వర్కౌట్ చేసుకోవడం దర్శకులకు సవాల్ గా మారింది. ఒరిజినల్ వెర్షన్లు ఓటిటిలో ఉండటం, ప్రేక్షకులు వాటిని ముందే చూసేయడం లాంటి కారణాలు బజ్ మీద ప్రభావం చూపిస్తున్నాయి. అందుకే భైరవం విషయంలోనూ ఇలాంటి అనుమానాలు సహజంగానే తలెత్తాయి.
దర్శకుడు విజయ్ కనకమేడల రాసుకున్న ట్రీట్ మెంట్ భైరవంకు మాస్ లో హైప్ తెచ్చేలా ఉంది. ఇప్పటిదాకా అండర్ కవర్ గా ఉంటూ బజ్ విషయంలో కాస్త ముందు వెనుకా ఊగిన ఈ సినిమాకు ఇప్పుడు బిజినెస్ ఎంక్వయిరీలు పెరిగాయంటే ట్రైలరే దోహదం చేసింది. జూన్ 1 నుంచి ఎగ్జిబిటర్లు థియేటర్లు బంద్ చేయబోతున్నారనే వార్తలున్నప్పటికీ ఆలోగా సమస్య పరిష్కారం అవుతుందనే ధీమాతో భైరవం డీల్స్ ని పూర్తి చేసే పనిలో ఉన్నట్టు నిర్మాత ఉన్నారట. ముఖ్యంగా చాలా గ్యాప్ తీసుకున్న బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఇమేజ్ ఈ మూవీకి ఓపెనింగ్స్ పరంగా ప్లస్సవుతుందనే నమ్మకం టీమ్ లో ఉంది.
పోటీ లేని బాక్సాఫీస్ వాతావరణం కాబట్టి పాజిటివ్ టాక్ తో కనక భైరవం నిలబడగలిగితే జూన్ 12 హరిహర వీరమల్లు వచ్చే వరకు ఫ్రీ రన్ దక్కుతుంది. ఆలోగా సులభంగా బ్రేక్ ఈవెన్ అందుకోవడమే కాదు లాభాలు కూడా చూడొచ్చు. ఎంత టార్గెట్ అనే వివరాలు ఇంకా బయటికి రాలేదు కానీ పదిహేను నుంచి పాతిక కోట్ల మధ్య టార్గెట్ లాక్ కావొచ్చని అంటున్నారు. ఈ ఏడాదిలో సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ తర్వాత మాస్, ఫ్యామిలీస్ ఇద్దరినీ మెప్పించిన సినిమాలు పెద్దగా రాలేదు. కోర్ట్, మ్యాడ్ స్క్వేర్, హిట్ 3 జానర్ పరిమితుల వల్ల అన్ని వర్గాలను చేరుకోలేదు. మరి భైరవం ఆ లోటు తీరుస్తుందేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates